రాజధానులపై రాష్ట్రస్థాయి చర్చ: టీడీపీని ఒంటరి చేసే వ్యూహం: అమరావతికి జగన్ వ్యతిరేకం..!
అమరావతి: అమరావతి ప్రాంతంలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచీ తన వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే వస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు. ఆ వ్యతిరేక భావన ఉండటం వల్లే ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి శంకుస్థాపనకు హాజరు కాలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత.. నామమాత్రంగా బడ్జెట్ ను కేటాయించారని గుర్తు చేశారు.

చర్చలకు అవకాశం..
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటులో వైఎస్ జగన్ అనూహ్యంగా వ్యూహాలను అనుసరించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయడానికి ఆయన ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్రస్థాయిలో చర్చకు తెర తీసి, ప్రజల అభిప్రాయాలను సేకరించేలా ప్రభుత్వం అడుగులు వేయొచ్చని ఆయన విశ్లేషించారు.

టీడీపీని ఒంటరి చేసే ఎత్తుగడ..
రాష్ట్ర స్థాయిలో చర్చకు తెరతీయడమంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతును దాదాపుగా కోల్పోవచ్చని చెప్పారు. రాజధాని ప్రాంతం నుంచి మినహా ఉత్తరాంధ్ర, రాయలసీమలో జిల్లాల్లో తెలుగుదేశం తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించక తప్పని పరిస్థితి తలెత్తక తప్పదని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చెప్పారు. దీనితోపాటు- మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం అసెంబ్లీలో సైతం చర్చిస్తుందని, అఖిల పక్షాన్ని సైతం సమావేశపర్చవచ్చని అన్నారు.

ముందు నుంచీ వ్యతిరేకమే..
అమరావతిలో రాజధాని అనే ఆలోచనను ముఖ్యమంత్రి ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారని నాగేశ్వర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ.. దానికి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హాజరు కాలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అదే వైఖరిని కనపర్చారని, బడ్జెట్ లో సైతం భారీగా నిధులను కేటాయించే ప్రయత్నమే చేయలేదని అన్నారు.

నిర్మాణ పనులను నిలిపివేయడం ఇందులో భాగమే..
అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రాజధాని నిర్మాణ పనులను నిలిపివేయడం కూడా ఇందులో భాగమేనని ఆయన అంచనా వేశారు. రాజధానిని తరలిస్తామనే సమాచారంపై లీకులు ఇస్తూ వచ్చారని, దీనిద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఈ ఆరునెలల కాలంలో వైఎస్ జగన్ ఏనాడు కూడా అమరావతికి అనుకూలంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. అమరావతిని నిర్మించడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా వైఎస్ జగన్ వైఖరికి ఓ కారణమై ఉండొచ్చని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications