ఏపీలో బడి పిల్లలకు కొత్త సీఎం వరం సర్కార్ వరం: ప్రతి శనివారం క్లాసులుండవ్! ఆట.. పాటలే!
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆయన.. కాంట్రాక్టర్లపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో.. దానికి భిన్నంగా పాఠశాల విద్యార్థుల పట్ల మమకారాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త వరాన్ని ఇచ్చారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ దిశగా కనీసం ఆలోచన చేయలేదు.
ప్రతి శనివారం నో బ్యాగ్ డే..కేవలం ఆటపాటలే!
అదే- ప్రతి శనివారం పుస్తకాల బ్యాగ్కు సెలవు ప్రకటించడం. పాఠశాల విద్యార్థులు ఇకపై ప్రతి శనివారం పుస్తకాల సంచిని తీసుకెళ్లాల్సిన పని ఉండదు. ఆ రోజు తరగతులు ఉండవు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించరు. విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో సరదాగా, ఆటపాటలతో గడిపాల్సి ఉంటుంది. చదువుతో పాటు ఆటపాటల్లో విద్యార్థులను పాఠశాల దశ నుంచే ప్రావీణ్యులను చేయడంలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
దీని ప్రభావం ప్రభుత్వ పాఠశాలలపై సానుకూలంగా ఉంటుందని, మధ్యలో బడిని మానివేసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడం రాత్రికి రాత్రే అయ్యే పని కాదని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం కూడా మధ్యలో బడి మాని వేయడానికి ఓ కారణమనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడం సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోణంలో వైఎస్ జగన్ ఆలోచన చేశారని అంటున్నారు.
డ్రాప్ అవుట్లకు అడ్డుకట్ట పడుతుందా?
బడి పిల్లలు పాఠశాలలకు ఆకర్షితులను చేయడంలో భాగంగా.. ప్రతి శనివారం ఆటపాటలతో గడిపేలా నిర్ణయం తీసుకున్నారని, ఇది సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు విద్యా విధానంలో కూడా సమూల మార్పులు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారనేది స్పష్టమౌతోంది. 44 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించడం వెనుక ఉన్న కారణం అదే.
బడి అంటే పిల్లలకు భయం పోగొట్టి, హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చనే అభిప్రాయాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవడం వల్ల డ్రాప్ అవుట్లకు బ్రేక్ పడటం ఖాయం. దీనికితోడు- అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టాలని, ఆ దిశగా ప్రణాళికలను రూపొందించాలని సూచించారని అంటున్నారు. అవన్నీ పక్కాగా అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమనే అభిప్రాయం అధికారుల్లో నెలకొంది.
మౌలిక సదుపాయాల కంటే.. విద్యార్థుల్లో ఉత్సాహం నింపడానికే ప్రాధాన్యత.
ఇప్పటికీ చాలా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు దయనీయంగా ఉన్నాయి. వాటి మౌలిక వసతులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలంటే నాణ్యమైన విద్యకు సుదూరంగా ఉంటాయనే బలమైన భావన సాధారణ ప్రజల్లో నెలకొని ఉంది. అందుకే- ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తారు. ఖర్చయినా ప్రైవేటు స్కూళ్లల్లో తమ పిల్లలను చదివించడానికే ఇష్ట పడతారు. వాటన్నింటి మీదా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
మంచి నిర్ణయమంటోన్న విద్యావేత్తలు
మధ్యాహ్న భోజన పథకం అమలుపై అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులతో సమీక్షించిన ఆయన డ్రాప్ అవుట్లను తగ్గించడం, నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షతులు అయ్యేలా తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడానికి తక్షణ చర్యలకు దిగడం హర్షణీయమని అంటున్నారు పలువురు విద్యావేత్తలు. మౌలిక సదుపాయాల కల్పన అనేది ఖర్చుతో కూడుకున్న పనులు కావడం వల్ల అవన్నీ ఇప్పట్లో సాధ్యం కావని, అందుకే- పిల్లల్లో అవగాహనను, ఉత్సాహాన్ని నింపేలా వైఎస్ జగన్ చర్యలు చేపట్టడం మంచి నిర్ణయమని చెబుతున్నారు.