వెంటాడుతున్నారా : ఎవరికి ఎవరు చెక్ పెడతారు : సీయస్ వర్సెస్ ఏపి క్యాబినెట్..!
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. రాజకీయ పోరు ముగిసినా..అధికార పోరు ఆరంభమైంది. ఎన్నికల సంఘం ఏపి సీయస్ పునీతను మార్చి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను నియమించారు. ఆయన నియామకాన్ని ముఖ్యమంత్రి మొదలు మంత్రులంతా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వ్యవహారం పైన ఇప్పుడు సీయస్ సమీక్షలు చేయటం కొత్త వివాదానికి కారణమైంది.

సీయస్ వెంటాడుతున్నారా..
ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఇప్పుడు చేస్తున్న సమీక్షలు.. అధికారులతో చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతుల పెట్టుబడి నిధుల విడుదల పైన ఎల్వీ అధికారులతో సమీక్షించారు. నిధులు మొత్తం ఈ పధకాలకే ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది..టిడిపి ప్రభుత్వంలోని పెద్దలకు రుచించటం లేదు. ఎన్నికల్లో ఓటు కురిపిస్తాయనే నమ్మకంతో ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రుణ విముక్తి పధకాలకు నిధులు విడుదల చేసారు. అయితే, ఇప్పుడు సీయస్ ఆ పధకాలకు నిధుల విడుదల పైన సమీక్షించటం .. అధికారులను నిలదీయటం పైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది.

సీయస్ లక్ష్యంగా మంత్రుల ఫైర్..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేస్తున్న ఆర్దిక సమీక్షల పై మంత్రి యనమల రామకృష్ణుడు మండి పడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు బడ్జెట్లోనే ఆమోదం ఉందని యనమల గుర్తు చేస్తున్నారు. అన్నదాత సుఖీభకు రూ.5000 కోట్లు, పసుపు-కుంకుమకు రూ.4000 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెబుతున్నారు. బడ్జెట్లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందికి రావని ఇప్పటికే కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని యనమల ప్రస్తావించారు. అలాంటి పథకాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించడం సరికాదన్నారు. అదే విధంగా
ఎన్నికల ప్రక్రియకు ఛీప్ సెక్రటరీకి సంబందం లేదని, సిఇఓ మాత్రమే దీనిని నిర్వహించాలని యనమల చెబుతున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం తీరు పైన ఏపి క్యాబినెట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సీయస్ వెంటాడుతున్నారా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు..లోపాల పైన ఎల్వీ సుబ్రమణ్యం వెంటాడుతున్నారనే అభిప్రాయం అధికార పార్టీలో నెలకొంది. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే విధంగా వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇక, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తరువాత నాటి నిర్ణయాల పైన ఇప్పుడు సమీక్షించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపిలో సీయస్ ద్వారా కేంద్రం తమకు కావాల్సిన సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు ఏపి ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే, ఇటువంటి పరిస్థితులు అంచనా వేసిన ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర లాంటి వారు ఇప్పటికే సెలవు మీద వెళ్లారు. ఇప్పుడు సీయస్ వర్సెస్ అన్నట్లుగా ఏపిలో మారుతున్న పరిస్థితులు అధికారులు సంకటంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications