విశాఖ పోర్టుకు చైనా షిప్ .. కరోనా వైరస్ టెన్షన్ లో వైజాగ్ వాసులు
చైనాలో మొదలై వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ బాధితులు 98,382కు చేరగా 3,383 మంది మృత్యువాతపడ్డారు.ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని రూమర్స్ బాగా ప్రచారం అవుతున్నాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలు భయపడుతున్నారు.ఇక ఏపీలో కూడా కరోనా భయం పట్టుకుంది. ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం కరోనా వైరస్ వస్తుందేమో అన్న అనుమానాలు పెరిగిపోయాయి.
Recommended Video
కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ సర్కార్ .. 23 మందికి పరీక్షలు చేస్తే ..
విశాఖకు వచ్చిన ఓ చైనా కార్గో షిప్
ఇక ఇదే సమయంలో విశాఖ తీరానికి వచ్చిన ఓ చైనా షిప్ విశాఖ వాసులను భయపెడుతుంది . భారత్లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం పడకుండా వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్గా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక వందల మంది అనుమానితులుగా ఉన్నారు.
ఫార్చ్యూన్ హీరో అనే కార్గో షిప్ లో 22 మంది చైనా, మయన్మార్ దేశస్థులు
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకున్న సమయంలో విశాఖ తీరానికి చైనాకు సంబంధించిన ఒక కార్గో షిప్ వచ్చింది. చైనాకు చెందిన ఫార్చ్యూన్ హీరో అనే కార్గో షిప్ గురువారం విశాఖ తీరానికి చేరుకుంది. ఇక చైనా, మయన్మార్ కు సంబంధించిన షిప్లో మొత్తం 22మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 17మంది చైనీయులు, ఐదుగురు మయన్మార్ వాసులు ఉన్నారు. ఇప్పటికే చైనా అంటే కరోనా అని భయపడుతున్న విశాఖ వాసులు చైనా షిప్ విశాఖ తీరంలో ఉండటంతో భయపడుతున్నారు. వారిని ఇక్కడికి రానివ్వకండి అని కోరుతున్నారు.
పోర్టుకు దూరంగా షిప్... షిప్ లో ఉన్నవారికి వైద్య అధికారుల పరీక్షలు
ఇక ఈ షిప్ విశాఖ పోర్టుకు చేరుకునేందుకు నెల రోజుల క్రితమే ఒడిశాకు చెందిన స్టివిడోస్ కంపెనీ అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. కానీ కరోనా వైరస్ నేపధ్యంలో తీవ్ర భయంతో ఉన్న ప్రజలు కొంతకాలం చైనా షిప్ లు ఆపితే బాగుంటుంది అని భావిస్తున్నారు. కరోనా వైరస్ భయం నేపథ్యంలో ఆ షిప్ను పోర్టుకు దూరంగా అధికారులు నిలిపివేశారు. అక్కడే షిప్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత కరోనా లేదు అని నిర్ధారణ అయితే షిప్ పోర్టుకు రావాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.