జగన్ కు తలనొప్పిగా చీరాల రచ్చ.. మత్య్సకారుల ఘర్షణతో పాటు పీక్స్ కి కరణం ,ఆమంచి వర్గ పోరు
చీరాల వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్య కార్మికుల మధ్య చోటుచేసుకున్న వివాదం రాజకీయ దుమారంగా మారింది . సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. చీరాలలో మత్స్యకారుల ఘర్షణ నేపధ్యంలో ఆమంచి వర్సెస్ కరణం బలరాం వివాదం మరోమారు తెరమీదకు వచ్చింది .మొన్న ఆమంచిని మహిళ నిలదీస్తే , ఇప్పుడు కరణం బలరాం ను ఏకంగా ఎమ్మెల్యేగా రాజీనామా చెయ్యాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఎంపీ ముందే ఆమంచిని నిలదీసిన మహిళ .. ఇప్పుడు కరణం రాజీనామాకు డిమాండ్
ఇటీవల మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చీరాలలో ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కఠారి వారి పాలెం, వాడరేవు మత్స్యకారులను పరామర్శించిన సందర్భంలో ఎంపీ ముందే ఆమంచి కృష్ణ మోహన్ ను ఒక మహిళ నిలదీసింది . ఇక తాజాగా మత్స్యకారుల సమస్య పరిష్కరించలేకపోతున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తూ చీరాల వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండటం చీరాలలో ఉద్రిక్తతలకు అద్దం పడుతుంది.
మత్స్యకారుల ఘర్షణకు రాజకీయ వివాదాలే కారణం అంటూ చర్చ
చీరాలలో మత్స్యకారుల వివాదం రాజకీయ దుమారం గా మారుతుంది. బల్ల వల , ఐల వల వినియోగం విషయంలో వాడరేవు కఠారి వారి పాలెం మత్స్యకారుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివాన తీవ్రంగా దాడులు చేసుకునే దాకా వెళ్ళింది. ఇప్పటికీ మత్స్యకారుల మధ్య వివాదం సమసిపోలేదు. ఒకటిగా కలిసి ఉండాల్సిన మత్స్యకారులు రెండుగా విడిపోయి తన్నుకోవడానికి చీరాలలో ఉన్న రాజకీయ వివాదాలే కారణమని చర్చ జరుగుతుంది.
కరణం బలరాం ఉండగానే ఎంపీ ముందు ఆమంచిపై మహిళ ఆగ్రహం .. కరణం పనేనా?
మొన్న వాడరేవు, కఠారి వారి పాలెం క్షతగాత్రులను ఎంపీ మోపిదేవి వెంకటరమణతో పాటుగా ఎమ్మెల్యే కరణం బలరాం , కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తదితరులు పరామర్శించారు. మత్స్యకారులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచికి వ్యతిరేకంగా ఆమంచి డౌన్ డౌన్.. ఆమంచి గో బ్యాక్ అంటూ వాడరేవు మత్స్యకారులు నినాదాలు చేశారు . ఐకాన్ ఆసుపత్రి వద్ద మోపిదేవి బాధితుల పరామర్శ సమయంలోనూ ఓ మహిళ మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచిని నిలదీసింది. ఆ రోజు చీరాల లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆమంచి, కరణం వర్గీయులను ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అయితే అదంతా కరణం బలరాం పనేనని ఆమంచి వర్గీయుల వాదన .
కరణం బలరాం టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు
ఇక తాజాగా వాడరేవు ,కఠారి పాలెం మత్స్య కారుల మధ్య పోరు నడుస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు అన్న వాదన వినిపిస్తుంది. మొన్న ఆమంచికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డాడు ఆమంచి కృష్ణ మోహన్ అని తాజాగా చర్చ జరుగుతుంది. దాని పర్యవసానమే తాజా పరిణామాలు అని స్థానికులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని ప్రచారం చేస్తున్నారు.
మత్స్యకారుల సమస్య పరిష్కరించలేని కరణం బలరాం రాజీనామా డిమాండ్
చిన్న సమస్యను పరిష్కరించలేని కరణం బలరాం కు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేందుకు అర్హత ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేనా మీ సీనియారిటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా ఆమంచి కృష్ణ మోహన్ పని అని కరణం బలరాం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. రెండు గ్రామాలను పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మత్స్యకారుల ఘర్షణతో మరోమారు ఆమంచి వర్సెస్ కరణం బలరాం
మత్స్యకారుల సమస్యను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చీరాల రాజకీయాన్ని రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తిట్టి పోసుకుంటున్నారు. ఇదే సమయంలో మోపిదేవి వెంకటరమణ వచ్చిన రోజున ఆమంచి వర్గీయుడిపై కరణం వర్గీయుల దాడి కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో ఇప్పుడు చీరాలలో కరణం, ఆమంచి వర్గాలమధ్య వార్ పీక్స్ కు చేరుకుంది . ఇది మత్స్యకారుల ఘర్షణతో మరోమారు తెరపైకి వచ్చింది.