ఏంచేస్తారు?: చిరు ప్రశ్న, చూస్తూ పురంధేశ్వరి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీలను సీమాంధ్ర ప్రాంత మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావులు కలిసి తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని అయితే, విభజన అనివార్యమైతే సీమాంధ్రలో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. తాము మొదట సమైక్యవాదాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అనివార్యమైతే మాత్రం తమ ప్రాంతానికి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వారు మొదట మొయిలీతో భేటీ అయ్యారు. అనంతరం చిదంబరాన్ని కలిశారు. సీమాంధ్రకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా, ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచిన తరువాతే విభజన చేయాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలోనే ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిపాత్ర ఉందని ఆయన తెలిపారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల సీమాంధ్రలో నియోజకవర్గాల సంఖ్య తగ్గగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 12 నియోజకవర్గాలు పెరిగాయని, ఈ 12 నియోజకవర్గాలలో కనీసం ముప్ఫై లక్షల మంది సీమాంధ్రులున్నారని, భాగ్యనగరం కొంతమంది పాలిట అభాగ్య నగరంగా మారటం దురదృష్టమని చెప్పారు. కాగా విభజన అనివార్యమని తేలడంతో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు తమ ప్రాంతం కోసం డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చిరంజీవి
కేంద్రమంత్రులు వీరప్ప మొయిలీ, చిదంబరంలతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి.
చిదంబరంతో
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంతో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, జెడి శీలంలు. విభజనతో తమకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని అడిగారు.
షిండే
కేంద్ర మంత్రుల బృందం(జివోఎం) భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే. మరో రెండు మూడు జివోఎం భేటీలు ఉంటాయని చెప్పారు.
జివోఎం
న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో భేటీ అయిన జివోఎం సభ్యులు నారాయణ స్వామి, జైరామ్ రమేష్, షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు.