జీవితంలో 150వ సినిమా: చిరు, ఫ్యాన్స్ కోసమే: పవన్
హైదరాబాద్/విజయవాడ: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు తమ సినిమాల పైన శుక్రవారం స్పందించారు. చిరంజీవి ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ గెలుపు బాధ్యతలను మీద వేసుకున్నారు. సీమాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక.. పవన్ జనసేన పార్టీని స్థాపించి... చిరుకు విరుద్ధంగా వెళ్తున్నారు! ఆయన బిజెపి, టిడిపి కూటమికి మద్దతిస్తున్నారు.
ఇరువురు రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో వారి సినిమాల పైన అనుమానాలు తలెత్తాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సినిమాలకు విరామం ఇచ్చినప్పటికీ... చిరంజీవి 150వ సినిమా పైన ఎన్నాళ్ల నుండో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరు ప్రచారంలో భాగంగా అభిమానులు అడగటంతో తమ సినిమాల పైన స్పందించారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రోడ్ షోలో ఫ్యాన్స్కు చిరంజీవి తన 150వ సినిమా పైన హామీ ఇచ్చారు. ఉత్కంఠకు తెరదింపే ప్రయత్నం చేశారు. అభిమానులు పదే పదే సినిమా గురించి అడగటంతో ఆయన.. తాను తన జీవితంలో తప్పకుండా 150వ సినిమా తీస్తానని చెప్పారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో పవన్ తన సినిమాల పైన మాట్లాడారు. గబ్బర్ సింగ్ 2 ఎప్పుడని అభిమానులు పవన్ని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ... సినిమాలు చేస్తూనే.. మీ సమస్యల పరిష్కారానికి రాజకీయంగానూ పోరాడుతానని చెప్పారు.
తనకు సిమాల్లో నటించే ఆసక్తి లేదని, అభిమానుల ఇష్టం మేరకు సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు నటించిన సినిమాలు చాలని, ప్రజల పక్షాన నిలబడి ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఎవరికి అన్యాయం జరిగినా పోరాటాలు చేసేందుకు తాను ఎప్పుడు సిద్దమేనని, తాను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, అభిమానుల కోసం మాత్రం సినిమా తీస్తానని చెప్పారు.