మేయర్ హత్య: వేధింపులని బుల్లెట్ సురేష్ రిలేటివ్స్, మంత్రి బొజ్జలకు 'రెడ్' బెదిరింపు!
చిత్తూరు: నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో విచారణ పేరిట తమను పోలీసులు వేధిస్తున్నారని బిసి సంఘం నాయకులు బుల్లెట్ సురేష్ దగ్గరి బంధువులు శ్రీదేవి, కవిత తదితరులు వాపోతున్నారు. బుధవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కటారి దంపతుల హత్య కేసు విచారణ నిమిత్తం బుల్లెట్ సురేష్ ఆచూకీ చెప్పాలని రోజుల తరబడి పోలీసు స్టేషన్కు తిప్పిస్తున్నారన్నారు. తమకు ఆరోగ్యం సరిగా లేదని, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.
కాగా, మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ, మరో 20 మంది నిందితులకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండు పొడగిస్తూ బుధవారం స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

నవంబరు 17న నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు చింటూ, ఘటనలో పాల్గొన్న, సహకరించిన మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మినహా మిగిలిన 21 మందిని అరెస్టు చేశారు. పోలీసులు రిమాండు నిమిత్తం చింటూను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
మంత్రికి బెదిరింపు కాల్?
మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి తమిళనాడు ఎర్రచందనం దొంగల నుంచి బుధవారం బెదిరింపు ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఏర్పేడులో ఆరుగురు తమిళ స్మగ్లర్లను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బొజ్జలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై బొజ్జల స్పందించవలసి ఉంది.












Click it and Unblock the Notifications