సీఐడీ చేతిలో లోకేశ్ టీం గుట్టు : ఫైబర్ నెట్ స్కాంలో కీలక ఆధారాలు : 19 మంది పై ఎఫ్ఐఆర్...!!
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ఆరోపిస్తున్న ఫైబర్ నెట్ లో అవినీతి పైన సీఐడీ కీలక సమాచారం రాబట్టింది. మాజీ మంత్రి లోకేశ్ పర్యవేక్షించిన ఐటీ శాఖ పరిధిలో ఫైబర్ నెట్ నిర్వహణ సాగింది. అందులో దాదాపు రెండు వేల కోట్ల మేర అవినీతి జరిగిదంటూ ప్రస్తతు ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేసారు. దీంతో..విచారణ చేసిన సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్కు చెందిన టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ (టెరాసాఫ్ట్) సంస్థకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించా రని విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది.
ఫోర్జరీ పత్రాలతో మేలు చేసేలా
కంపెనీని బ్లాక్లిస్టు నుంచి హడావుడిగా తొలగించి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. టెక్నికల్ కమిటీలో అస్మదీయుడిని నియమించి.. నిపుణుల అభ్యంతరాలను బేఖాతర్ చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్నెట్ టెండర్లను కట్టబెట్టేశారనే అంశం సీఐడి విచారణలో తేలింది. దాదాపు రూ.2 వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీఐడీ ఫైబర్ నెట్ టెండర్లలో అవినీతిని ఆధారసహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణప్రసాద్ (టీడీపీ ప్రభుత్వంలో ఇ-గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు), కె.సాంబశివరావు (నాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ- ఎండీ) సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
కోర్టుకు ఎఫ్ఐఆర్ సమర్పించిన సీఐడీ
ఈ మేరకు ఎఫ్ఐఆర్ను న్యాయస్థానానికి సమర్పించింది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ) ద్వారా ఈ -టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్లిస్ట్లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణంగా గుర్తించారు.
టెరాసాఫ్ట్ కనికట్టు చేసిందంటూ
ఫైబర్ నెట్ టెండర్లలో పాల్గొనేందుకు ఫోర్జరీ అర్హత పత్రాలను సృష్టించి టెరాసాఫ్ట్ కంపెనీ కనికట్టు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాలి. కన్సార్టియం లీడ్ కంపెనీకి మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి కనీసం రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్ బ్రాడ్కాస్ట్ ఏర్పాటై అప్పటికి 8 నెలలే అయింది. మరోవైపు ఫైబర్ నెట్ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్ ఫోర్జరీ పత్రాలు సమర్పించింది.
లోకేశ్ సన్నిహితులకు మేలు జరిగేలా
సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్కు డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసినట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించింది. వాస్తవానికి మోడర్న్ కమ్యూనికేషన్ - బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్ అనే సంస్థ ఆ పరికరాలను సరఫరా చేసింది. సీఐడీ విచారణలో సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్ధారించింది. వేమూరి హరికృష్ణప్రసాద్ను ప్రభుత్వ ఇ-గవర్నింగ్ అథారిటీ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన్ను ఫైబర్నెట్ టెండర్ల ప్రక్రియను పరిశీలించే సాంకేతిక కమిటీలో సభ్యుడిని కూడా చేశారు.
నిబంధనలు ప్రతీ చోటా ఉల్లంఘించారంటూ
నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ వేమూరి అప్పటికే టెరా సాఫ్ట్ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్గా ఉన్నారు. అదే కంపెనీలో టెరా సాఫ్ట్ యజమాని తుమ్మల గోపీచంద్ భార్య పావనీదేవి కూడా డైరెక్టర్గా ఉన్నారు. టెండర్ల కమిటీ సమావేశంలో ఏపీటీఎస్ చైర్మన్ సుందరం టెరా సాఫ్ట్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ వేమూరి హరికృష్ణ ప్రసాద్ నిర్ణయంతో టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ టెండర్లను కట్టబెట్టారు.
Recommended Video
భారీ నష్టం చేసారంటూ సీఐడి ఎఫ్ఐఆర్
ఫైబర్నెట్ కార్పొరేషన్కు టెరాసాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం, నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్ నెట్ కార్పొరేషన్కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది.