అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణ
కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్గా సాగుతున్న వివాదం సీఐడీ నోటీసుల వరకూ వెళ్లింది. కరోనా సమయంలో హఫీజ్ ఖాన్పై అఖిలప్రియ చేసిన కామెంట్లపై సీఐడీ ఆమెకు నోటీసులు పంపింది. హఫీజ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
భూమా అఖిలప్రియ సంచలనం: 3 రాజధానులతో సీమకే నష్టం, కానీ కర్నూలును..
కరోనా సమయంలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు వైరస్ సోకినట్లు జిల్లాలో ప్రచారం జరిగింది. భూమా అఖిలప్ర్రియతో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఈ ప్రచారానికి కారణమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఆయన ఓ క్వారంటైన్ సెంటర్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. స్వయంగా కరోనా రోగి అయి ఉండి క్వారంటైన్ సెంటర్కు వెళ్లి కరోనా వ్యాపింపజేశారంటూ అఖిలప్రియ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. తనకు కరోనా లేకపోయినా అఖిలప్రియ ఉద్దేశపూర్వకంగా తనపై బురద జల్లేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
Recommended Video
ఆ తర్వాత ఇరువర్గాలు శాంతించడంతో ఈ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. కానీ కరోనా పేరుతో తనపై రాజకీయంగా బురద జల్లేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారని ఆగ్రహంగా ఉన్న హఫీజ్ ఖాన్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు... గురువారం విచారణకు రావాలని కోరినట్లు సమాచారం.