సినిమా టికెట్ ధరలపై జగన్ ముందుకే..జేసీల చేతికి అధికారం.. కోర్టువైపు టాలీవుడ్ చూపులు
కొంత కాలంగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనేందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. దీని పైన డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రెండు రోజుల క్రితం సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ జారీ అయిన జీవోకు ముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది.

డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం అప్పీల్
సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయా లని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, ఆ కాపీ దాఖలుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

జాయింట్ కలెక్టర్ల అనుమతితో అంటూ
అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా.. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు ఇచ్చిన హైకోర్టు ఇక్కడ కీలక మెలిక పెట్టింది. లైసెన్స్ జారీచేసే అధికారి అయిన జాయింట్ కలెక్టర్కు ముందస్తు సమాచారం ఇచ్చి, ఆయన్ని సంప్రదించిన తరువాతే టికెట్ రేట్లను ఖరారు చేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది. జీవో 35 జారీకి ముందున్న విధంగానే టికెట్ల ధరలను నిర్ణయించుకోవచ్చని మాత్రమే యాజమాన్యాలకు చెప్పింది.

రెండు వైపులా వాదనలు..వాయిదా
మంగళవారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ బుధవారం సాయంత్రం అందుబాటులోకి రావడంతో కోర్టు ఏం చెప్పిందన్న దానిపై స్పష్టత వచ్చింది. అంతేగాక మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీచేసిన జీవో 35ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, ఈ రోజు జరిగిన విచారణలోనూ రెండు పక్షాల తరపున వాదనలు కొనసాగాయి. ఈ కేసులో తదుపరి వాదనల కోసం హైకోర్టు ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications