సీజే ఎన్వీరమణ చొరవ-21 ఏళ్ల తర్వాత ఒక్కటైన భార్యాభర్తలు-దేశవ్యాప్తంగా ప్రశంసలు
భారత ప్రధాన న్యాయమూర్తిగా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. 21 ఏళ్ల క్రితం విడిపోయిన ఏపీకి చెందిన ఓ జంటను తన చొరవతో తిరిగి కలపడం ద్వారా జస్టిస్ రమణ న్యాయవ్యవస్ధలోనే అరుదైన ఘట్టానికి తెరలేపారు. సుప్రీంకోర్టు వరకూ వచ్చిన ఈ కేసును మధ్యవర్తిత్వంతో పరిష్కరించడం ద్వారా ఎన్వీ రమణ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

సీజేఐ రమణ అరుదైన మధ్యవర్తిత్వం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా న్యాయవ్యవస్ధలో మధ్యవర్తిత్వం అవసరాన్ని కూడా పలుమార్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదే కోవలో తన వద్దకు వచ్చిన ఓ భార్యాభర్తల కేసును తానే చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన జస్టిస్ రమణ.. వారిని 21 ఏళ్ల తర్వాత తిరిగి కలిసేలా చేశారు. ఇందుకు రమణ చేసిన అరుదైన ప్రయత్నం ఇప్పుడు న్యాయవ్యవస్ధతో పాటు సాధారణ ప్రజల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది.

అసలేం జరిగిందంటే...
ప్రస్తుతం గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న కళ్లెం శ్రీనివాసశర్మకు 21 ఏళ్ల క్రితం 1998లో శాంతితో వివాహం జరిగింది. 1999లో వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో శాంతి తనపై శ్రీనివాసశర్మతో పాటు వారి కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ 498 కింద కేసు పెట్టారు. దీంతో గుంటూరు స్ధానిక కోర్టు ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. 2010లో హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు శిక్ష తగించింది. దీనిపై శాంతి తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు జస్టిస్ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనానికి విచారణకు వచ్చింది.

మానవీయ పరిష్కారం చూపిన జస్టిస్ రమణ
దంపతుల మధ్య మనస్పర్ధక కారణంగా ఎప్పుడో రెండు దశబ్దాలుగా సాగుతున్న ఈ కేసును మానవతా దృక్పథంతో పరిశీలించిన జస్టిస్ రమణ.. తనదైన శైలిలో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారు. శాంతి పెట్టిన 498 కేసు పరిశీలించి తన భర్తకు శిక్ష కావాలా, తన జీవితానికి పరిష్కారం కావాలా అని అడిగారు. తన జీవితానికి భరోసా కావాలని శాంతి చెప్పడంతో భర్త శ్రీనివాసశర్మను తిరిగి కాపురం చేసుకుంటే శిక్ష ఉండదని సూచించారు. దీంతో ఆయన కూడా అంగీకరించారు. కేసు వెనక్కి తీసుకునేందుకు శాంతి కూడా ఒప్పుకోవడంతో ఈ కేసు మూసేసి ఇరువురిని తిరిగి సజావుగా కాపురం చేసుకోవాలని సూచించి పంపేశారు.

జస్టిస్ రమణపై ప్రశంసల జల్లు
సుప్రీంకోర్టు వరకూ వచ్చిన గృహహింస కేసును తన అరుదైన మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే మధ్యవర్తిత్వం అవసరాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేస్తున్న జస్టిస్ రమణ.. ఇప్పుడు స్వయంగా తానే బరిలోకి దిగి రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన జంటను కలపడంపై న్యాయవర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. కేసుల కంటే మానవీయ పరిష్కారాలే ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయవ్యవస్ధకే ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications