కిరణ్, కెసిఆర్..రెండ్రోజుల టైం: తెరాసలోకి బాబుమోహన్!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీలో ఉండేవారెవరు, గుడ్ బై చెప్పేవారెవరు, తెలంగాణలో టిడిపి బలమెంత, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటి అనే అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది.
కిరణ్ రెడ్డి కొత్త పార్టీ విషయమై బహిష్కృత కాంగ్రెసు ఎంపీలు, ఇతర నేతలతో ఆదివారం చర్చించారు. భేటీ అనంతరం సబ్బం హరి, హర్ష కుమార్లు మాట్లాడుతూ.. సీమాంధ్రలో కొత్త పార్టీ అవసరం ఉందని, అదే విషయాన్ని కిరణ్కు చెప్పామన్నారు. రెండ్రోజుల్లో కిరణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వారి మాటల ద్వారా కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయన ప్రకటన చేసి ఆ తర్వాత సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించే అవకాశాలున్నాయి.
రెండ్రోజుల్లో కెసిఆర్...
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలా లేక పొత్తుకు మొగ్గు చూపాలా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పిన కెసిఆర్.. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో రాజకీయ పరమైన అంశాలను మాట్లాడుతానని చెప్పారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులను కలిసి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందని, మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉంటానని కెసిఆర్ చెప్పారు. ఢిల్లీలో ఉంటున్న కెసిఆర్.. డిగ్గీ వంటి సీనియర్ నేతలతో విలీనం, పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దానిపై స్పష్టత వచ్చే అవకాశం దాదాపుగా ఉంది. విలీనం కంటే పొత్తే రెండు పార్టీలకు మేలు అని కెసిఆర్ చెబుతుండగా, కాంగ్రెసు మాత్రం విలీనం కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు సీమాంధ్రలో పార్టీని కాపాడే విషయమై కాంగ్రెసు పార్టీ నేతలు దృష్టి సారించారు. ఇంకోవైపు తెలంగాణలో బిజెపి, కాంగ్రెసు, టిటిడిపి, తెరాస, ఇతర పార్టీలు క్రెడిట్ను సొంతం చేసుకునే పనిలో పడ్డాయి. తామే తెలంగాణ ఇచ్చామని బిజెపి, తమ వల్లే వచ్చిందని కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాసలు పోటా పోటీగా ప్రచారంలో మునిగిపోతున్నాయి.
బాబు మోహన్ తెరాసలోకి!
కెసిఆర్తో చర్చల తర్వాతే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ మెదక్ జిల్లాలో అన్నట్లుగా సమాచారం. కాంగ్రెసు పార్టీలో విలీనం కాకుంటే తాను తెరాసలో చేరుతానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, తాను ఏ పార్టీలో ఉన్నా ఆందోల్ నుండే పోటీ చేస్తానని చెప్పారు. కాగా, బాబు మోహన్ తెరాసలో చేరరని, ఆందోల్లో ఇప్పటికే దామోదర రాజనర్సింహ కాంగ్రెసు పార్టీ నుండి బరిలో ఉన్నారని, తెరాస - కాంగ్రెసు ఒక్కటవుతున్న సమయంలో బాబు మోహన్ తెరాసలోకి వెళితే ఆయనకు నియోజకవర్గం సమస్య ఎదురవుతుందని అంటున్నారు.