ఒక్క ఫోన్ కాల్.. పెద్ద చిచ్చే పెట్టింది: కడపలో స్టూడెంట్స్ వర్సెస్ లోకల్స్..
కడప: కాల్ జంప్ అయి అప్పుడప్పుడు ఫోన్ కాల్ వేరేవాళ్లకు వెళ్లడమనేది సర్వసాధారణం. ఒక్కోసారి నంబర్ తప్పుగా డయల్ చేసినా.. వేరెవరికో కాల్ వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో 'సారీ అండి.. రాంగ్ నంబర్' అని పెట్టేస్తే ఎవరికీ ఏ బాధా ఉండదు.
అలా కాకుండా.. 'నాకే కాల్ చేసి నన్నెవరు అని అడుగతావా?..', 'అసలు నువ్వెవరో చెప్పు..' వంటి భేషజాలకు పోయారంటే.. గొడవ కాస్త పెద్దదిగా మారడం ఖాయం. తాజాగా కడప జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఇదీ జరిగింది..:
కడప రిమ్స్ డెంటల్ కాలేజీకి చెందిన రెసిడెన్షియల్ విద్యార్థులు.. పొరపాటున ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరికి ఫోన్ చేశారు. అది కాస్త పట్టణంలోని మారుతీనగర్కు చెందిన ఓ యువకుడికి వెళ్లింది. తెలియని వ్యక్తికి ఫోన్ చేయడంతో.. అవతలి వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇధ్దరి మధ్య మాటల యుద్దం నడిచింది.

మాటా మాటా పెరిగి..:
ఫోన్ చేసిన రిమ్స్ విద్యార్థుల్ని మొదట ఆ యువకుడు 'ఎవరు?'.. అని ఆరా తీశాడు. దీంతో తాము రిమ్స్ డెంటల్ కాలేజీ విద్యార్థులమని చెప్పారు. అయితే నాకెందుకు ఫోన్ చేశారని ఆ యువకుడు కాస్త గట్టిగానే బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయింది.

కాలేజీలో గొడవ:
ఫోన్ కాల్ లోనే ఇరువురు తీవ్ర పదజాలంతో విరుచుకుపడటంతో వివాదం ముదిరింది. దీంతో ఆ యువకుడు మరికొందరు స్నేహితులను వెంటబెట్టుకుని నేరుగా రిమ్స్ డెంటల్ కాలేజీ వద్దకు వెళ్లాడు.
కాలేజీ వద్దకు చేరుకున్న ఆ యువకుడు.. తనకు ఫోన్ చేసిన విద్యార్థులతో గొడవకు దిగాడు.

పోలీసుల అదుపులో..
ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఆపై ఉద్రిక్త పరిస్థితుల దాకా వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, ప్రిన్సిపాల్ తో చర్చిస్తున్నామని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.












Click it and Unblock the Notifications