జగన్ సభ వెనక సిఎం హస్తం: మా హైదరాబాద్ శ్రీధర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సలహా మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లో సమైక్య సభను పెడతానని ప్రకటించాడని మా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ ధర్మాసనం ఆరోపించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి నాయకునిగా ఉంటున్న సిఎం కిరణ్, సమైక్యవాదిగా ప్రకటించుకున్న జగన్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, అయితే వారిద్దరూ కుమ్మక్కై హైదరాబాద్లో సమైక్య సభ పెట్టేందుకు నిర్ణయించారని ఆయన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్లో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సమైక్య సభకు సిఎం కిరణ్ సూత్రధారిగా వ్యవహరించాడని, మంత్రి గంటా శ్రీనివాసరావు కో-ఆర్డినేటర్గా పనిచేశారని శ్రీధర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో హైదరాబాద్లో సమైక్య సభలు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
సిఎం కిరణ్కు, జైలు నుంచి విడుదలైన జగన్కు మధ్య సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమ నాయకత్వం కోసం ఆధిపత్య పోరాటం కొనసాగుతోందని అన్నారు. సమైక్యవాదులు తమ ఆధిపత్య తగవులను తమ ప్రాంతంలో తీర్చుకోవాలని గానీ తెలంగాణలో బలప్రదర్శన చేస్తామంటే ఎవ్వరూ ఊరుకోరని అన్నారు.సమైక్యవాదిగా ప్రకటించుకున్న జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లోని భూములపై తప్ప తెలంగాణ ప్రజలపై మమకారం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్లో సమైక్య సభను పెట్టే నైతిక అర్హత జగన్కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో జగన్ సభ పెడితే తీవ్ర పరిణామాలుంటాయని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సభకు అనుమతివ్వొద్దని పోలీసు ఉన్నతాధికారులను కోరతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని మా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు.