ప్రధాని రాక వేళ గేరు మార్చిన చంద్రబాబు - ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంఛ్ కోసం మే 2న రానున్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి తో పాటుగా మరి కొన్ని ప్రధాన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్న ట్లు సమాచారం. అమరావతికి కేంద్రం అండగా నిలుస్తోంది. ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ రాక సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తున్నారు.
అమరావతికి ప్రధాని
అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీ రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మంత్రల సమావేశంలో వెల్లడించారు. అమరావతి తొలి విడత పనుల కోసం రుణ సమీకరణ పూర్తయింది. దశల వారీగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం అయింది. ఇదే సమయంలో అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ పైనా చర్చ సాగుతోంది. ఈ అంశం పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగాసిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పైన కసరత్తు జరుగుతోంది. దీని కోసం కొత్తగా అవసరమైన భూములు..ఆర్దిక వనరుల పైన నిపుణుల నివేదిక కోరారు.

మెగా సిటీ దిశగా
అమరావతిని విస్తరణ చేయాలని.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం దాదాపు 6 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుందని భావిస్తున్నారు. దీంతో, ఈ మేరకు భూముల పరిశీలన ప్రారంభమైంది. ఇందు కోసం కావాల్సిన భూములను సేకరించాలా.. సమీకరణ చేయాలా అనేది ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందనే చర్చ సాగుతోంది. సమీకరణ ద్వారా అయితే రైతులకు ప్రయోజనం ఉండటంతో..వారు అదే కోరుకుంటున్నారు. అదే విధంగా క్రీడానగరాన్ని నిర్మించాలనే ఆలోచనా ఉందని తాజాగా మంత్రి నారాయణ వెల్లడించారు.
పనుల వేగవంతం
అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయటానికి గనులశాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సీఆర్డీఏకు కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయంచారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కి.మీ. ట్రంక్ రోడ్లు నిర్మించ నున్నారు. రెండున్నరేళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో రూ.64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రధాని పర్యటనలో కేంద్రం నుంచి అమరావతికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications