పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారు, రౌడీషీట్లు ఎత్తేయండి, చంద్రబాబు ఆర్డర్
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు తెరచి టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి రౌడీషీట్లు మొత్తం ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంత మంది పోలీసు అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని, అలాంటి వాళ్లు ఆ మత్తు నుంచి బయటకు రావాలని ఇంతకాలం వైసీపీ నాయకుల భజన చేసిన పోలీసు అధికారులకు చురకలు అంటించారు.
కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయకుడు ఆ పర్యటన విజయవంతంగా ముగించుకుని వెళ్లారు. అంతకు ముందు కప్పం నియోజక వర్గంలోని గుడుపల్లె మండలంలోని నలగంపల్లె డిగ్రీ కాలేజ్ లో అధికారుల సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు కొంత మంది పోలీసు అధికారులకు ఝలక్ ఇచ్చారు. 2019కి ముందు తన మీద ఎలాంటి కేసులు లేవని, తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన మీద 22 కేసులు పెట్టారని, మాజీ సీఎం హోదాలో ఉన్న తన మీద ఏకంగా రెండు హత్యాయత్నం కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్లు రౌడీషీట్లు తెరచి వారిని జైలుకు పంపించారని, టీడీపీ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురి చేశారని, ఆ రౌడీషీట్లు మొత్తం ఎత్తేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజమైన రౌడీషీటర్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు.
ఇక ముందు రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టకూడదని, రాజకీయ నాయకులు చెప్పినట్లు తలఊపుతూ అమాయకుల మీద కేసులు పెట్టకూడదని, అలా చేస్తే వైసీపీ పాలనకు, మా పాలనకు తేడా ఉండని చంద్రబాబు అన్నారు. 2019 నుంచి వైసీపీ నాయకులు ప్రోత్బలంతో కొంత మంది అధికారులు మనసు చంపుకుని పని చేశారని, ఇప్పుడు ధైర్యంగా మీరు మీ పనులు చేసుకోవచ్చని, మీ పనుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు హామీ ఇచ్చారు.

అంతకు ముందు కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో చంద్రబాబు మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టమని, జీవితంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల జోలికి రాకుండా చేస్తానని చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు మాట ఇచ్చారు. కుప్పం ప్రజలకు తాను అండగా ఉంటానని, ఇక ముందు రౌడీయిజం చెయ్యాలని చూస్తే వైసీపీ నాయకులకు తగినబుద్ది చెబుతామని, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications