ఆ విషయంలో చంద్రబాబు 'ది బెస్ట్' : నీతి ఆయోగ్ సీఈవో వెల్లడి!
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్యాష్ బోర్డును ప్రశంసించారు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. నేటి ఉదయం నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా.. ఉత్తమ విధి విధానాలను అనుసరించే రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇవ్వాలంటూ అమితాబ్ ను కోరారు చంద్రబాబు.
ఇక ఏపీ సీఎం డ్యాష్ బోర్దును 'ది బెస్ట్' అంటూ అమితాబ్ మెచ్చుకున్నారని తెలుస్తోంది. దేశంలో అవలంభిస్తోన్న విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి సంరక్షణ విధానాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ భేటిలో ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి అమితాబ్ కు వివరించారు చంద్రబాబు.
రాష్ట్రంలో అన్ని శాఖలను డిజిటలైజ్ చేశామని, రియల్ టైంలో జీఎస్డీపీని అంచనా వేస్తున్నామని అమితాబ్ తో చంద్రబాబు పేర్కొన్నారు. పల్స్ సర్వే రిపోర్టులు చేతికందితే ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.10వేల కనీస ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని అమితాబ్ తో చెప్పారు చంద్రబాబు.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ తో భేటీకి ముందు నీతి ఆయోగ్ ఛైర్మన్ పనగారియాను హోటల్ గేట్ వేలో కలిశారు చంద్రబాబు. ఇద్దరి మధ్య కాసేపు భేటీ జరగ్గా.. అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.