అద్భుతం చేశారు: బాబుకు వెంకయ్య ప్రశంస, విట్కు శంకుస్థాపన
అమరావతి: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన సచివాలయం నిర్మించడం చంద్రబాబు కార్యదక్షతకు నిదర్శనమని వెంకయ్య కొనియాడారు. గురువారం ఉదయం చంద్రబాబుతొ కలిసి వెలగపూడిలోని సచివాలయాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించారు.
ఆయన ఏపీ తాత్కాలిక సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు భవనాల నిర్మాణం గురించి చంద్రబాబు వివరించారు. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రపదేశ్కు తొలి ర్యాంకు రావడంపై వెంకయ్య అభినందనలు తెలిపారు. ఉత్తమ పరిపాలన ఉంటే ఇలాంటి ఘనతలు సాధ్యమవుతాయని ప్రశంసించారు.
చిన్నపాటి సమస్యలు ఇంకా ఉన్నప్పటికీ కుటుంబంలో ఏవిధంగా అంతా సర్థుకుపోతారో ఉద్యోగులు కూడా అదేవిధంగా సర్దుకు పోతుండడం మంచి వాతావరణానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

విట్ శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతిలోని ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు.
అంతా బాబు కృషే
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విట్ లాంటి ప్రతిష్టాత్మాక సంస్థ ఏపీకి రావడానికి చంద్రబాబు కృషి అభినందనీయమని అన్నారు. విట్ సంస్థ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అమరావతిలో విట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విశ్వనాథన్ను అభినందించారు.
రాష్ట్రాల అభివృధ్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశం ముందుకెళ్లాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపారం కావాలి. దేశాన్ని మార్చాలంటే సంస్కరణలు కావాలని ప్రధాని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. సంపదను పెంచకుండా పంచగలమా? అని ప్రశ్నించారు.
మనం నెంబర్ వన్ కావాలి
చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రైవేటు రంగంలో మొట్టమొదటి సంస్థగా విట్కు శంకుస్థాపన చేసుకున్నాం.. దేశంలోని ఉత్తమ వర్సిటీలన్నీ అమరావతికి వస్తాయని తెలిపారు. విట్ రూపంలో ప్రపంచస్థాయి విద్యాసంస్థ రావడం శుభసూచకమన్నారు.
వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీది స్ఫూర్తిదాయక చరిత్ర.. 1984లో స్థాపించిన ఈ సంస్థ 3 దశాబ్దాల్లోనే ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా రూపొందిందని వివరించారు. విట్లో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు వస్తాయని, అన్ని క్యాంపస్ల కంటే అమరావతి విట్ ముందుండాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలో దేశంలో మన రాష్ట్రం ఐదోస్థానంలో ఉంది... నెంబర్వన్గా ఎదగాలన్నదే నా కోరిక అని వివరించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టార్స్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్టార్స్ పథకం కింద ప్రతి జిల్లా నుంచి ఒక బాలిక, బాలుడిని ఎంపిక చేసి విట్లో నాలుగేళ్ల పాటు ఉచితంగా ఇంజినీరింగ్ విద్య అందిస్తామని ప్రకటించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన 26మందికి ఉచితంగా పుస్తకాలు, వసతి ఏర్పాటు చేస్తామన్నారు.
మెడికల్ జోన్ కింద డెంటల్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్ వైస్ఛాన్సలర్ విశ్వనాథన్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్బాబు, ఎంపీ గల్లా జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications