ఆ ఇద్దరు మంత్రులకు సీఎం జగన్ కీలక బాధ్యతలు..!!
తాజాగా కేబినెట్ భేటీలో కొందరు మంత్రుల పని తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు మంత్రులకు ప్రభుత్వ తరపున బాధ్యతలను ఖరారు చేసారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయాలు కీలకం. ఈ కమిటీలో మంత్రివర్గ మార్పుకు ముందు సభ్యులుగా మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ ఉండేవారు. ప్రభుత్వం తరపున సభలో ప్రవేశ పెట్టే బిల్లులు..చర్చల గురించి వివరించే బాధ్యతలు అప్పగించారు.
అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వచ్చే సూచనలు..వారి డిమాండ్ల పైనా ప్రభుత్వం నుంచి సభలో ఏ విధంగా స్వకరించేదీ తమ అభిప్రాయాన్ని స్పీకర్ కు వివరిస్తారు. అయితే, ఆ ఇద్దరు మంత్రుల స్థానంలో ఇప్పుడు బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ లను నియమించిన సీఎం జగన్.. బీఏసీలో శాసనసభా వ్యవహారాల కోఆర్డినేటర్ గా గడికోట శ్రీకాంత్ రెడ్డి ని నియమించారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అయిదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా సభా నిర్వహణతో పాటుగా అజెండాను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, హైకోర్టు అమరావతికి సంబంధించి తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం దీని పైన న్యాయపరంగా రివ్యూకు వెళ్లలేదు. హైకోర్టులో రివ్యూ దాఖలు చేయటం..లేదా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాల్సి ఉంటుంది. దీని పైన ప్రభుత్వం న్యాయసలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక, వైసీపీ..ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్న సమయంలో..ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశం ఉంది. సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సమాయత్తం అవుతుండగా, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్దంగా ఉన్నామని చెబుతోంది. దీంతో..బీఏసీ నుంచే ప్రభుత్వం తరపున సమర్ధవంతంగా వాదన వినిపించేందుకు ఈ ఇద్దరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.