ముద్రగడకు వైసీపీ బంపరాఫర్ : టార్గెట్ పవన్ కళ్యాణ్..!!
వచ్చే ఎన్నికలకు ఏపీలో అధికార వైసీపీ ముందస్తు వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా తొలి నుంచి సామాజిక లెక్కల పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 2019 లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పార్టీ గెలుపుకు కలిసి వచ్చింది. ఇక, అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేబినెట్ మొదలు పార్టీ పదవుల వరకు అన్నింటా సామాజిక సమీకరణాలు అమలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీతో జత కడతారని వైసీపీ విశ్వసిస్తోంది. ఇప్పటి వరకు పవన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పవన్ వైపు కాపు ఓటింగ్ వెళ్లకుండా
దీంతో..గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపు ఓటింగ్ ఈ సారి కొంత మేర పవన్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అందునా.. కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే గోదావరి జిల్లాల్లో పరిస్థితుల పైన సర్వేల ద్వారా సీఎం జగన్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అందులో భాగంగానే..పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు సిద్దమయ్యారంటూ వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో..పాటుగా కాపు ఓటింగ్ తమ నుంచి చేజారకుండా కాపాడుకొనేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. దశాబ్దాల కాలంగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముద్రగడ కుమారుడు వైసీపీలో చేరుతారంటూ
2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా రాజకీయంగా వేడి పెంచారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేయించటం.. నిర్బంధించటం పైన ముద్రగడ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, జగన్ సీఎం అయిన తరువాత ముద్రగడ కొన్ని అంశాల పైన లేఖలు రాయటం మినహా ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు.
అదే సమయంలో...రాజకీయంగానూ మౌనంగా ఉంటున్నారు. గతంలో సుదీర్ఘ కాలం చట్ట సభలకు పని చేసిన ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. కానీ, ముద్రగడ కుటుంబం నుంచి ఆయన కుమారుడికి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్దమైందని తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం సాగుతోంది. ముద్రగడతో సన్నిహిత సంబంధాలు ఉన్న తూర్పు గోదావరి వైసీపీ నేతలు ఈ చర్చలు చేయగా ఒక అంగీకారానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
గోదావరి జిల్లాలో నెగ్గితేనే..అధికారంలోకి
ముద్రగడ కుమారుడు పార్టీలో చేరితే.. ప్రత్తిపాడు స్థానం కేటాయించేలా ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. దీని ద్వారా ముద్రగడ మద్దతు వైసీపీకి ఉండేలా ఆ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ కారణంగా ఏదైనా పార్టీ ఓట్ బ్యాంక్ కు నష్టం జరిగితే..అది ముద్రగడ కుటుంబ మద్దతు ద్వారా భర్తీ చేసుకొనే అవకాశం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరు..ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం సేకరణ విషయంలో వైసీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టింది. నివేదికల ఆధారంగా అవసరమైన నిర్ణయాలు,. పార్టీలో చేరికలు ఉండేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. దీంతో..గోదావరి జిల్లాల కేంద్రంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.