రాజధాని బిల్లులపై రోజుకో ట్విస్ట్- హైకోర్టులో కౌంటర్ ఆలస్యం - జగన్ ఆలోచన అదేనా...!
ఏపీ శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాజధాని బిల్లులతో పాటు ఇతర వ్యవహారాల్లో అదే మండలిని పరిగణనలోకి తీసుకుంటూ చేస్తున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మారిన పరిస్ధితులకు ఇవి అద్దం పట్టేలా ఉన్నాయి. అదే సమయంలో హైకోర్టు కూడా రాజధాని బిల్లులపై త్వరగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరడం ఈ మొత్తం వ్యవహారాన్ని రసవత్తరంగా మార్చేస్తోంది.
రజనీకాంత్ v/s విజయ్ ఫ్యాన్, విరాళాలపై గొడవ, డిష్యూం.. డిష్యూం, ప్రాణం తీసిన అభిమానం
మండలి రద్దు ప్రతిపాదన హుళక్కే...
ఏపీలో రాజధాని బిల్లులు ఆమోదించలేదనే కారణంతో శాసనమండలి రద్దు కోరుతూ ఈ ఏడాది జనవరిలో వైసీపీ సర్కారు.. కేంద్రానికి తీర్మానం పంపింది. ఇది ఆరు నెలలుగా కేంద్ర పరిశీలనలోనే ఉంది. దీన్ని పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారో తెలియని పరిస్ధితి. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మండలి రద్దు ప్రతిపాదనలను ప్రభుత్వం ఏ క్షణాన్నైనా వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఈ మేరకు కోరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
మండలి పరిణామాలపై ఫిర్యాదులు...
గతంలో మండలి రద్దుకు ప్రతిపాదించి, అసలు అసెంబ్లీ సమావేశాలను సైతం మండలి భేటీ లేకుండానే నిర్వహించేందుకు సిద్ధమైన వైసీపీ సర్కారు.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనసు మార్చుకున్నట్లు అర్దమవుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో మరోసారి రాజధాని బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన వైసీపీ సర్కారు.. ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి మండలి రద్దుకు ప్రతిపాదించిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలపై ప్రభుత్వం ఆసక్తి కనబరచడం భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా నిలుస్తోంది.
రాజధాని బిల్లులపై హైకోర్టు...
రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీకి పంపినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని ఆరోపిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు కూడా వీటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. గడువు ముగిసినా ప్రభుత్వం వీటికి కౌంటర్ దాఖలు చేయకపోగా వేచి చూసే ధోరణే అవలంబిస్తోంది. దీనిపై నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే
ప్రభుత్వం మాత్రం మారిన పరిస్ధితుల్లో కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరుతోంది. ఇక్కడే ప్రభుత్వ వ్యూహమంతా ఉందనే ప్రచారం సాగుతోంది.
జగన్ వ్యూహం అదేనా...
అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులు మండలి అభిప్రాయంతో సంబంధం లేకుండానే నెల రోజుల వ్యవధితో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా తప్పనిసరి. కాబట్టి గవర్నర్ ఆమోదం లభించే వరకూ ఈ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మండలితో సంబంధం లేకుండానే బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే ఇక హైకోర్టులో దాఖలు చేసే కౌంటర్ కు కూడా విలువ ఉండదు. ఇప్పుడు హడావిడిగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తే దానిపై ఏదో ఒక ఉత్తర్వు జారీ అయితే మళ్లీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. దీంతో ప్రస్తుతానికి ప్రభుత్వం వేచి చూసే ధోరణే అవలంబించనుందనే సంకేతాలు వస్తున్నాయి.