కొడాలి నానికి మద్దతుగా నిలుస్తారా : అసెంబ్లీ వేదికగా గుడివాడ - పీఆర్సీ పై.. : 14 నుంచి సమావేశాలు..!!
ఏపీలో అధికార - ప్రతిపక్షాల మధ్య సాగుతున్న యుద్దం..ఇక, ఒకే వేదిక పై నుంచి సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా మంత్రి కొడాలి నాని.. ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు అసెంబ్లీ వేదికగానే అన్నింటికీ సమాధానం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
అదే సమయంలో బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన సమయం దగ్గర పడటంతో..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది .కేంద్రం ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సిద్దం అవుతోంది.
అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తం
కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించే అంశాలు..రాష్ట్రానికి వచ్చే రెవిన్యూ అంచనాలు.. కేంద్ర పన్నుల వాటా పైన ప్రతిపాదనలు చూసిన తరువాత రాష్ట్ర ఆదాయం పైన అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. అందుకోసం వచ్చే నెల 14వ తేదీన సమావేశాలను ప్రారంభించి... బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో సభా నిర్వహణతో పాటుగా బిజినెస్ పైన అదే రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ప్రధానంగా సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యేసినో నిర్వహించారంటూ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసాయి. కొడాలి నాని సైతం తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు.
గుడివాడ రగడ.. పీఆర్సీ పైనా క్లారిటీ
అయితే, దీని పైన ప్రతిపక్షాలు సీఎం స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాల సమయంలో దీని ని మరోసారి ప్రస్తావిస్తూ.. కొడాలి నాని పైన చర్యలను డిమాండ్ చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉంది. దీంతో..సభలోనూ టీడీపీకి కౌంటర్ ఇచ్చేందుకు సీఎంతో సహా మంత్రులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటుగా తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసిన కొత్త జిల్లాల అంశం... వివాదాస్పదంగా మారిన పీఆర్సీ అంశం పైన సభా వేదికగానే ప్రజలకు వివరించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తామంటూ నోటీసు ఇచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దీంతో..ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
టీడీపీ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా
దీంతో..అసెంబ్లీ వేదికగానే జీతాల పెరుగుదల ఉందా లేదా అనే అంశం పైన గణాంకాలతో సభా వేదికగా వివరించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. అదే విధంగా నర్సాపురం లోక్ సభ బై పోల్ అంశం పైన ఈలోగానే క్లారిటీ రానుంది. ఇక, చంద్రబాబు కిందటి సమావేశాల్లో తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో కాలు పెట్టనని శపధం చేయటంతో ..తిరిగి ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవు.
కానీ, కొడాలి నాని టార్గెట్ గా సభలోనూ టీడీపీ వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు .. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Recommended Video
ఇక..టార్గెట్ 2024 దిశగా అడుగులు
ఈ సమావేశాలు ముగుస్తూనే.. .ముఖ్యమంత్రి పాలనా పరమైన మార్పులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా కేబినెట్ విస్తరణతో పాటుగా పాలనా వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. మరో మూడు నెలల్లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్ల కాలం ముగుస్తుంది. దీంతో.. మిగిలిన కాలంలో వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా అటు పార్టీని..ఇటు ప్రభుత్వాన్ని నడిపించేందుకు సీఎం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నడుమ జరిగే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తి కరంగా మారనున్నాయి.