ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్; ఈ నెలలోనే వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం!!
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల వ్యూహాలను ఇప్పటినుంచే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్ గ్రామాలలో సమగ్ర సర్వే పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పై కూడా దృష్టి పెట్టాలని, అర్బన్ ప్రాంతాలలో డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని సూచించారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ఇచ్చి ప్రోత్సహించాలని జగన్ పేర్కొన్నారు. ఇక స్వయం ఉపాధి కార్యక్రమాలలో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం చాలా కీలకమని పేర్కొన్న ఆయన మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

గ్రామీణ అభివృద్ధి కింద సమీక్ష చేయాలని, కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అంతేకాదు నివేదికల ఆధారంగా యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, స్వయం ఉపాధి కార్యక్రమాలలో మహిళలకు చేయూత నిచ్చి ముందుకు నడిపించడం చాలా కీలకమని జగన్ పేర్కొన్నారు.
అయితే జులై 26వ తేదీన జరగవలసిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ నాలుగో విడత ప్రారంభ కార్యక్రమం ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల వాయిదా వేశారు. దీంతో ఈ సున్నా వడ్డీ పథకాన్ని ఆగస్టు 10వ తేదీన నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
వైయస్సార్ హయాంలో పావలా వడ్డీ రుణాలతో ప్రారంభించబడిన ఈ పథకం తర్వాత సున్నా వడ్డీ పథకంగా అమలవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సంవత్సరం కూడా 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ జమ చేసింది.












Click it and Unblock the Notifications