జయము జయము చంద్రన్నా - సీఎం జగన్ ఫైర్ : అగచాట్లు పడుతున్నాం..!!
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. టీడీపీ నేతల పైన ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టుకు భారంగా మారాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాడు ఏం జరిగిందీ.. ఇప్పుడు ఏం చేస్తున్నారనే అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. పునరావాస సాయం పైన ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు.
ప్రత్యేక హోదా పేరుతో మభ్యపెట్టారు
నాడు ప్రత్యేక హోదా పేరుతో మభ్య పెట్టేందుకు చేసుకున్న ఒప్పందంతో కేంద్రాన్ని ఇప్పుడు నిధుల కోసం ఒప్పించేందుకు అగచాట్లు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్రానికి రూ 2900 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. నాడు ప్రత్యక ప్యాకేజీ పేరుతో చేసుకున్న ఒప్పందం కారణంగా.. నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు పెంచమని కోరినా కేంద్రం ముందుకు రావటం లేదన్నారు. నిర్మాణంలో పద్దతులు పాటించకుండా చంద్రబాబు ప్రాజెక్టను నాశనం చేసారంటూ మండిపడ్డారు. ముందుగా స్పిల్ వే..అప్రోచ్ పనులు పూర్తి చేసి..ఆ తరువాత కాపర్ డాం నిర్మాణం చేయాల్సి ఉందన్నారు.
కానీ, దీనికి విరుద్దంగా చేయటం కారణంగా ప్రాజెక్టులో నష్టం జరిగిందని..ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుతూ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ జరిగిన ఈ నష్టం గురించి ఆలోచన చేయాలన్నారు.
కేంద్రాన్ని ఒప్పించేందుకు ఇబ్బందులు పడుతున్నాం
ముఖ్యమంత్రిగా14 ఏళ్లు ఎలా పని చేసారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్ ఫిట్ అని వ్యాఖ్యానించారు. డాంలో పనులను చూసేందుకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లి.. అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేసారని మండిపడ్డారు. ప్రాజెక్టు దగ్గర జయము జయము చంద్రన్నా అంటూ భజన చేయించారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు.
టీడీపీ హయాంలో పోలవరం నిర్వాసితులకు రూ 6.86 లక్షల చొప్పున ఉన్న పరిహారంను తాము పది లక్షలు ఇస్తామని చెప్పామని..దీనికి అనుగుణంగా జీవో జారీ చేసామని సీఎం వివరించారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం 41.5 మీటర్ల వరకు నీటి నిల్వకు శ్రీకారం చుడుతామని చెప్పారు. 2013 చట్టానికి ముందు రూ 1.50 లక్షలు పొందిన వారికి రూ 5లక్షల వరకు ఇస్తామన్నారు.
ఆందోళన వద్దు..అమలు చేస్తాం
ప్రస్తుతం 41.5 అడుగుల వరకు లెక్క వేస్తే ఇవ్వాల్సింది రూ 500 కోట్లు మాత్రమే ఉంటుందని..ఇన్ని వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న తాము.. ఈ మొత్తాన్ని చెల్లించటానికి ఇబ్బంది లేదన్నారు. ఎవరూ దీని గురించి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా పనులు నిలిచాయని.. నవంబర్ నుంచి తిరిగి పోలవరం పనులు ప్రారంభించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
తప్పు చేసిన వారే..తమ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలు చూడండి.. సినిమా చూడండి అంటూ పోలవరం పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో టీడీపీ సభ్యులకు చురకలు అంటించారు. తాను నిర్వాసితులకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.