బెల్ట్ షాపు కనిపిస్తే బెల్టు తీస్తానంటున్న జగన్- అక్రమ ఇసుక తవ్వకాలపైనా వార్నింగ్
ఏపీలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బెల్టు షాపులు, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు బెల్ట్ షాపులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని విజిలెన్స అధికారులను సీఎం ఆదేశించారు.
బెల్ట్ షాపులు, ఇసుక అక్రమాలు కనిపించొద్దు..
ఏపీలో త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. విజిలెన్స్ తో పాటు ఎక్సైజ్, మైనింగ్ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన జగన్.. ఇసుక అక్రమ తవ్వకాలు, బెల్ట్ షాపులను అరికట్టాలని వారికి సూచించారు. ప్రభుత్వం గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసాకేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, ఇంగ్లిషుమీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామన్నారు.
గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయన్నారు.ఇలాంటి తరుణంలలో బెల్టుషాపులు, అక్రమ మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అధికారుతో వ్యాఖ్యానించారు.
గ్రామాల్లో బెల్ట్ షాపులు కనిపిస్తే బెల్ట్ తీస్తా
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టు షాపులు నడవరాదని,మద్యం అక్రమ తయారీ ఉండకూడదని సీఎం సూచించారు.. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదన్నారు.సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదని సీఎం ఆదేశించారు.ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదని,గ్రామాల్లో ఉన్న 11వేలకుపైగా మహిళా పోలీసుల సేవలను వాడుకోవాలన్నారు. ఇందుకోసం మహిళా పోలీసులకు ఫోన్లు కూడా ఇచ్చామన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలని సీఎం సూచించారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని, మహిళా మిత్రల సేవలను వాడుకోవాలన్నారు.
అక్రమాల నిరోధానికి సిబ్బంది పెంపు
బెల్టు షాపులు, ఇసుక ర్యాంపుల్లో అక్రమాల నిరోధం కోసం ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.ప్రొహిబిషన్ - ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనులకోసం వినియోగించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎన్ఫోర్స్ మెంట్ విభాగంతో కలిసి కట్టుగా వీరు పనిచేసి ఫలితాలు సాధించాలని సూచించారు.స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు.