జగన్ సర్కార్ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్?: ఆ కేంద్రమంత్రితో భేటీ అందుకే?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీలో పర్యటన సందర్భంగా ఇవ్వాళ పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, పెండింగ్ నిధుల కోసం ఆయా శాఖల మంత్రులను కలుసుకోనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రులతో..
తన ఢిల్లీలో పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ ఇవ్వాళ.. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ మేరకు ఆయనతో భేటీ దాదాపు ఖాయమైందని సమాచారం. వైఎస్ జగన్.. ఆ శాఖ మంత్రితో భేటీ కావడం ఇదే తొలిసారి అని, దీనికి కారణాలు లేకపోలేదని చెబుతున్నారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విద్య-నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశం అవుతారని తెలుస్తోంది.
సొంతంగా ఓటీటీ
ప్రభుత్వం తరఫున సొంతంగా ఓ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్ను తీసుకుని రావాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికోసం ఇదివరకు కొన్ని ప్రయత్నాలు సాగినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదని సమాచారం. ఇటీవలే దీనికి సంబంధించిన చర్చలు.. ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకుని రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జగన్ సర్కార్ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని సమాచారం.
సమాచార శాఖ మంత్రితో భేటీ.. అందుకే
కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో వైఎస్ జగన్ భేటీ కావడానికి ఇదీ ఓ కారణమని అంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను నెలకొల్పడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో- ఈ ప్లాట్ఫామ్ రూపురేఖలు ఎలా ఉండాలనే విషయం మీద కూడా కొన్ని వివరాలను సేకరించే అవకాశం లేకపోలేదని, మంత్రి నుంచి దీనికి అవసరమైన మార్గదర్శకాలను తీసుకుంటారని తెలుస్తోంది.
ఓటీటీ వల్ల
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలును ఓటీటీ ద్వారా ప్రసారం చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏపీలో మెజారిటీ మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ పలుమార్లు- బహిరంగ సభలు, సమీక్షా సమావేశాల్లోనూ స్పష్టం చేశారు. ఆయా మీడియా సంస్థల పేర్లు సైతం చెబుతూ- వాటి వైఖరిని ఎండగట్టారు.
సొంతంగా ఓటీటీ ఉండటం వల్ల..
ఇక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రాతిపదికన ఓటీటీ ప్లాట్ఫామ్ను తీసుకుని రాగలిగితే తాము చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రజలకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్ల- భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ ప్రభుత్వం దీన్ని కొనసాగించేలా ఈ సరికొత్త వ్యవస్థను తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
నిజాలను తెలియజేసేలా..
ప్రధాన మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలు ప్రసారమౌతున్నాయని, ప్రభుత్వం చేపడుతోన్న పథకాలను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురితం, ప్రసారమౌతున్నాయని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం తరఫున ఓటీటీని నెలకొల్పడమే మంచిదనే నిర్ణయంలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని అనుమతులు, విధి విధానాలు, మార్గదర్శకాలపై కేంద్ర, సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్తో సమావేశం కానున్నారని సమాచారం.
నూతన విద్యావిధానంపైనా
నూతన విద్యావిధానంపైనా వైఎస్ జగన్ ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఇవ్వాళ కలుసుకోనున్నారు. నాడు-నేడు కింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి గురించి ఆయనకు వివరించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తన సొంత జిల్లా కడపలో కొత్తగా ఏర్పాటు చేసిన కొప్పర్తి పారిశ్రామికవాడ గురించి వివరిస్తారని తెలుస్తోంది.