ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో .. అమరావతి ఉద్యమంపై సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్
టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన బీసీ సంక్రాంతి సభలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ఉద్యమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతి ఉద్యమం చంద్రబాబు బినామీలతో కొన్న భూములను కాపాడుకోవడం కోసమేనని ఆరోపించారు.

చెడిపోయిన బుర్రతో చంద్రబాబు సొంత లాభం కోసం రాజధాని అమరావతి ఉద్యమం
ఒక దిగిపోయిన పాలకుడు, చెడిపోయిన బుర్రతో సొంత లాభం కోసం రాజధాని అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అమరావతిలో రైతుల వద్ద నుండి తక్కువ ధరలకు భూములను ముందే కొని చంద్రబాబు, ఆయన బినామీలు గుట్టుచప్పుడు కాకుండా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. రాజధాని పెట్టాలని ముందుగా నిర్ణయించుకున్న క్రమంలో తమ వారందరితో చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందనేది అక్కడ కనిపిస్తుంది
చంద్రబాబు తాను లాభ పడటం కోసమే, తన స్వప్రయోజనాల కోసమే ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. అక్కడ భూముల ధరలు విపరీతంగా పెంచి, ఇప్పుడు ఆ ధరలు ఎక్కడ పడిపోతాయో అన్న ఆందోళనతో ఉద్యమం చేస్తున్నామని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందనేది ఈరోజు రాజధాని అమరావతిలో జరుగుతున్న జనభేరి సభలో కనిపిస్తుందని చంద్రబాబును ఉద్దేశించి , ఒక మంచి బుర్ర పని చేస్తే ఎలా ఉంటుంది అనేది బీసీ సంక్రాంతి సభలో కనిపిస్తుందని తనను గురించి చెప్పుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

ఒక పక్క రాజధానిలో జనరణభేరీ సభ , మరోపక్క బీసీ సంక్రాంతి సభ .. ఏపీలో విచిత్ర పరిస్థితి
మరోపక్క రాజధాని అమరావతి రక్షణ కోసం రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జన రణభేరి పేరిట బహిరంగ సభను అమరావతి జేఏసీ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఇప్పటికే రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అమరావతి రైతులకు మద్దతుగా మొదటి నుంచి టిడిపి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది .

రాజధాని ఉద్యమంపై సీఎం జగన్ వ్యాఖ్యలు .. ఏపీలో చర్చనీయాంశం
ఒకపక్క రాష్ట్రంలో రాజధాని అమరావతి కోసం ఆందోళన కొనసాగుతుంటే మరోపక్క విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలతో సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించటం , రాజధాని అమరావతి రైతుల ఉద్యమం కాదన్న రీతిలో , అది చంద్రబాబు తన స్వార్ధం కోసం చేయిస్తున్న ఉద్యమం అన్నట్టు సీఎం జగన్ వ్యాఖ్యలు చెయ్యటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications