చూడు... ఒకవైపే చూడు.. రెండోవైపు చూడొద్దు.. జగన్ హెచ్చరిక!!
ప్రతి రాజకీయ పార్టీకి అసమ్మతి సెగలు తప్పవు. ఏదో ఒక విషయంలో నేతలంతా అధినాయకత్వానికి ఎదురు తిరుగుతారు. చెప్పిన మాటను చెవికెక్కించుకోరు. తమకు నచ్చిందే కావాలంటూ పేచీకి దిగుతారు. తమ సామాజికవర్గ బలం ఇంత ఉంది.. నాకు సీటివ్వకపోతే అక్కడ మన పార్టీ ఓటమి తథ్యమంటూ అనేకరకాల లెక్కలు చెబుతారు. పరోక్షంగా అధిష్టానాన్ని బెదిరిస్తారు. వీరు చెప్పిన లెక్కలు సరిగానే ఉన్నాయనుకుంటే అధినాయకత్వం కూడా సరే అంటుంది. తమ సర్వే ప్రకారం అక్కడ వ్యవహారం సరిగా లేదనుకుంటే పక్కన పెడుతుంది. ఎన్నికల సమయంలో సీట్లు కేటాయించేటప్పుడు ఈ రగడ సర్వసాధారణం.
ఖరాఖండిగా చెప్పేసిన జగన్
ఈ అసమ్మతిని అరికట్టడానికి ముఖ్యనేతలు నచ్చచెబుతారు. విననివారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. కొందరు అసమ్మతి నేతలుగా తిరుగుబాటు చేస్తారు. మరికొందరు పార్టీ మారతారు. పార్టీలోనే ఉంటూ అసమ్మతి స్వరాలు వినిపించే నేతలవల్ల చెడ్డపేరు వస్తుందనుకుంటే వారిపై వేటు వేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందువరుసలో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించుకొని తెప్పించుకున్న నివేదికల ప్రకారం ఎమ్మెల్యేలతో మాట్లాడిన జగన్ పనితీరు ఆరునెలల్లోగా మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో సీటివ్వనని ఖరాఖండిగా చెప్పి పంపించేశారు.
మొదట్లోనే అసమ్మతిని అణచివేయాలి
నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో అసమ్మతి రాగాలు పెచ్చుస్వరంలో వినపడుతున్నాయి. దీంతో సీఎం జగన్ దీనిపై దృష్టిసారించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అసమ్మతిని అణచివేయకపోతే ఎన్నికలు జరిగే సమయానికి అదే పెద్ద సమస్యగా మారుతుందని, పార్టీ ఓటమిక కారణమవుతుందనేది ఆయన ఆలోచన.
అసమ్మతి నేతలతో మాట్లాడుతున్న అధిష్టానం
అసమ్మతి రాగాలు వినిపిస్తున్నవారిని పిలిపించి మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. వారి కోరికలు తెలుసుకొని ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అసమ్మతి నేతలు దారికి రాకపోతే వారిపై వేటు ఖాయమని హెచ్చరికలు జారీచేస్తున్నారు. మరికొందరి అసమ్మతి నేతల డిమాండ్లు సహేతుకంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకొని న్యాయం చేస్తానని జగన్ హామీ ఇస్తున్నారు.