విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: చంద్రబాబుపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు తెలుగు రాష్ర్టాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాయి.
ఈ ఫిర్యాదు స్పందించిన మానవ హక్కుల సంఘం సభ్యులు మిర్యాల సుబ్బారావు ఏపి ముఖ్య కార్యదర్శి, హోం శాఖకార్యదర్శి, ఆ రాష్ట్ర డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
హెచ్ఆర్సీని కలిసిన అనంతరం ఓయూ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులను నోటుతో కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రా ప్రజల మనోభావాలను కించపరచారన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశం నాయకులు సోయి తెచ్చుకుని చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ విద్యార్థి సంఘం, టిఆర్ఎస్వీ నాయకులు మయూర్నాథ్, వినోద్యాదవ్, సురేష్ముదిరాజ్, ముఖేష్, రామ్రాజ్ముదిరాజ్, సయ్యద్సాదిఖ్ తదితరులు ఉన్నారు.
మతి భ్రమించిన బాబు: మహేందర్రెడ్డి
గురుశిష్యులిద్దు ఒకేసారి కన్నంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురైన ఏపీ సీఎం చంద్రబాబుకు మతిభ్రమించిందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పీ మహేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కేకలు, పెడబొబ్బలతో నిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు నేరం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి బాస్ ఎవరో రాజకీయ వర్గాలు తేలిగ్గానే పసిగడతాయన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా దయాకర్రావు పేరు చెప్పడం సమస్యను తప్పుదోవ పట్టించడమేనన్నారు.












Click it and Unblock the Notifications