కండక్టర్ వికృతానందం: వందల మంది అమ్మాయిలకు బూతు మెసేజ్లు
ఓ బస్టు కండక్టర్, అతని మిత్రుడు అమ్మాయిలకు బూతు సందేశాలు పంపుతూ పైశాచికానందం పొందుతూ వస్తున్నారు. వారి బారిన వందలాది మంది అమ్మాయిలు పడ్డారు.
విజయవాడ: అమ్మాయిల ఫోన్లకు బూతు మెస్సేజ్లు పంపుతూ వికృతానందం పొందుతున్న బస్సు కండక్టర్ను, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వందలాది మంది అమ్మాయిలు వారి బారిన పడ్డారు. మెసేజ్లు చూడాలంటే అమ్మాయిలు బెదిరేపోయే స్థితికి తెచ్చిన వారిద్దరు విజయవాడ పోలీసులకు చిక్కారు.
కేసు వివరాలను విజయవాడ డిప్యూటీ కమిషనర్ జీ పాలరాజు, దక్షిణ మండలం సహాయ కమిషనర్ కంచి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం - విజయవాడ రూరల్ మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన పమిడిపాటి శ్రీనివాసరావు(39) ఆర్టీసీ గవర్నరుపేట డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు.
అజిత్సింగ్నగర్కు చెందిన పాస్టర్ కుమారుడు మార్లపూడి శామ్యుల్(30) జులాయి. శ్రీనివాసరావు రూటు నంబర్ 48(అజిత్సింగ్ నగర్) బస్సుపై రెగ్యులర్ కండక్టర్. ఇదే బస్సులో తరచుగా ప్రయాణం చేయడంతో శామ్యూల్తో అతనికి స్నేహం కుదిరింది.
ఆ కండక్టర్ ఇలా చేసేవాడు...
బస్సులో విద్యార్థినుల పాస్లు తనిఖీ చేసే సమయంలో వాటిపై ఉండే సెల్నంబర్లను శ్రీనివాసరావు రాసుకునేవాడు. దిగే హడావుడిలో కొంతమంది ప్రయాణికులు తమ మొబైళ్లను బస్సులోనే మరిచిపోవడం కూడా జరిగింది. వాటిలోని ఫోన్ లిస్టులో ఉన్న మహిళల ఫోన్ నంబర్లను అతడు నోట్ చేసుకొనేవాడు.
డ్యూటీ దిగిన తర్వా మిత్రుడితో కలిసి...
డ్యూటీ దిగిన తర్వాత శామ్యూల్తో ఆ విషయాలు చెప్పేవాడు. ఇద్దరూ కలిసి ఆ నంబర్లకు బూతు సందేశాలను పంపి వికృతమైన ఆనందం పొందేవారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో వందలమందిని వేధించినట్లు సమాచారం. ఒక్క విజయవాడలోనే రెండునెలల కాలంలో రెండు వందల అమ్మాయిలను వారు వేధించినట్లు వెలుగులోకి వచ్చింది.
చివరకు తమ కుటుంబసభ్యులనూ వదిలిపెట్టలేదు. శ్రీనివాసరావు తన భార్యకూ అసభ్య సందేశాలు పంపి.. వికృతానందం పొందేవాడు. ఎప్పటికప్పుడు నంబర్లు మార్చి జాగ్రత్త పడేవారు. అయితే, ఒకే సెల్ నుంచి ఆపరేషన్ చేసి పోలీసులకు దొరికిపోయారు.
ఓ అమ్మాయికి బూతు సందేశాలతో...
అలవాటు ప్రకారం, శ్రీనివాసరావు బస్సులో మూర్ఛ వచ్చిపడిపోయిన వ్యక్తి సెల్ తీసుకున్నాడు. ఆయన కుమార్తెకు సమాచారం ఇచ్చి పనిలో పనిగా ఆమె నంబరుని ఫీడ్ చేసుకొన్నాడు. రెండు రోజుల తర్వాత నుంచి ఆ అమ్మాయికి బూతు సందేశాలు రావడం ప్రారంభమయ్యాియ.
పరామర్శించే పేరుతో ఇలా...
మధ్యమధ్యలో ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ‘నాన్నకు ఎలా ఉందమ్మా' అంటూ పెద్ద మనిషిలా శ్రీనివాసరావు పరామర్శించేవాడు. శ్రీనివాసరావు తీరుపై అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే ఐఎంఈ నంబర్ ఉన్న ఫోన్ నుంచి మెసేజ్లు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముందుగా శామ్యూల్ను, అతని ద్వారా శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు.