కేసీఆర్పై రేవంత్ భార్య: కోర్టుకు వీడియో, వారితో మాట్లాడేందుకు రేవంత్ నో
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తన భర్త పైన కక్ష కట్టారన్నారు. ఏదో ఒక విధంగా తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తారనే విషయం తమకు తెలుసునని చెప్పారు.
అయితే, ఇంత త్వరగా అన్యాయంగా ఇరికిస్తారని ఊహించలేదని చెప్పారు. తెరాస పార్టీ నేతలందరికీ తన భర్త అంటే భయమని చెప్పారు. అందుకే ఆయనను టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలోని భూములను ఓ వ్యక్తికి ధారాదత్తం చేస్తుండటాన్ని తన భర్త అడ్డుకున్నందుకే టార్గెట్ చేశారన్నారు.
కాగా, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ కక్ష కట్టి అరెస్ట్ చేయించారని ఆయన సతీమణి గీత మంగళవారం టీడీపీ నేతలు కలిసినప్పుడు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పరామర్శించారు.
తెరాస మొత్తం తన భర్తను టార్గెట్ చేసిందని, వారికి ఆయనంటే ఎంత భయమో, సోమవారం అసెంబ్లీలో తెరాస నేతలు చేసుకున్న సంబరాలు చూస్తేనే తెలుస్తోందన్నారు. రేవంత్ కేసు నుంచి బయటపడతారని, తామంతా ఆయన వెనకే ఉన్నామని టీడీపీ నేతలు ఆమెకు భరోసా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి నిర్ణయం వెనుక..!
రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎల్ రమణ, పయ్యావుల కేశవ్ తదితరులు రేవంత్ను జైలులో కలిశారు. ఆ సమయంలోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
రేవంత్ ఆడియోను రీ రికార్డింగ్ చేసి చూడాలని కోర్టు ఆదేశం
రేవంత్ రెడ్డికి చెందిన ఆడియోను ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించింది. ఆ వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ ఆడియోను రీ రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఆడియో, వీడియో టేపులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు, రేవంత్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ టీడీపీ నేతలను కలిసేందుకు రేవంత్ నో
చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆంధ్రా, తెలంగాణ ప్రాంత నేతలు జైలుకు వెళ్తున్నారు. తనను కలిసేందుకు సొంత పార్టీ నేతలకు యస్ చెబుతున్న రేవంత్.. ఇద్దరు టీడీపీ నేతలకు మాత్రం నో చెప్పారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ప్రకాశ్ గౌడ్లతో ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.