ఏపీ స్కూళ్లలో కరోనా: ప్రకాశం జిల్లాలో ఐదురోజుల్లో 147కేసులు; నమోదైన కేసుల్లో 10శాతం కేసులు అక్కడే
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. ఇక రాష్ట్రాలలోనూ కరోనా కేసుల పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లలో విపరీతంగా కరోనా కేసు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా పదివేలకు పైగా కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఇక స్కూళ్ళలోనూ కరోనా కల్లోలం కొనసాగుతోంది.
గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లా స్కూల్స్ లో 147 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని పాఠశాలలలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్లో కరోనా కేసుల ప్రభావం అమాంతం పెరిగింది. సంక్రాంతి సెలవుల తర్వాత మరలా స్కూల్స్ కు వచ్చిన విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. గత ఐదు రోజుల్లో ఒక్క ప్రకాశం జిల్లాలోని స్కూల్స్ లోనే ఏకంగా 147 మందికిపైగా కరోనా సోకిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజా కేసుల్లో 10 శాతం కేసులు స్కూల్స్ నుండే
ఒక ప్రకాశం జిల్లాలో నమోదైన కేసులను 10 శాతం కేసులు స్కూల్స్ లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గురువారం నాడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 772 కరోనా కేసులు నమోదు కాగా అందులో 10 శాతం కేసులు పాఠశాలల్లో నమోదైనవే. భారీగా నమోదవుతున్న కేసులతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్స్ కు పంపించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గేవరకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో స్కూల్స్ బంద్.. కానీ ఏపీలో స్కూల్స్ కంటిన్యూ
పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో సైతం కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఏపీలో సైతం తాజా కేసుల పెరుగుదల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తున్నా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 150 రోజుల పాఠశాల పూర్తయిందని , మిగతా సెషన్ కూడా భౌతిక తరగతులు నిర్వహించి కొనసాగించాలనుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Recommended Video
ఏపీ స్కూల్స్ లో కేసుల పెరుగుదలపై ఆందోళన
కోవిడ్ మహమ్మారి కారణంగా, గత సంవత్సరాల్లో అందరిని పాస్ చేసిన విధానాన్ని అనుసరించామని , కానీ ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విద్యార్థులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉన్నప్పటికీ తాజాగా ఏపీ స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.