ఏపీలోనూ మహమ్మారి ఉధృతి; కర్నూలు మెడికల్ కాలేజీలో 15మంది మెడికోలకు కరోనా
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశం ఆరోగ్య సంక్షోభంలో చిక్కు కుంటోంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వ్యాప్తిని నివారించడానికి ఆంక్షలను పెట్టాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది.
కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో 15 మంది వైద్యవిద్యార్థులకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మెడికల్ కళాశాలలో నలుగురు హౌస్ సర్జన్ లతోపాటుగా, పలువురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తుంది. మెడికల్ కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కళాశాలలో మొత్తం ప్రస్తుతం 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే వీరికి సన్నిహితంగా ఉన్న వారికి కూడా ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఐసోలేషన్ లో వైద్య విద్యార్థులు
కరోనా మహమ్మారి బారిన పడిన 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాగా వీరితో కాంటాక్ట్ లో ఉన్న మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 20,78,964 కు చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకున్నారని అధికారిక డేటా చెపుతోంది.
భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా కరోనాపై సాగిస్తున్న పోరాటంలో ముందువరుసలో నిలిచిన వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండటం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులకు కారణంగా మారింది.
Recommended Video
దేశంలో వెయ్యికి పైగా వైద్య సిబ్బందికి కరోనా .. బీ అలెర్ట్
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కూడా వెయ్యికి పైగా వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కొందరు కోలుకోగా, మరికొందరు కరోనా మహమ్మారి బారినుండి కోలుకోవలసి ఉంది. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ పంజా విసురుతున్న సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇక కేసుల ఉప్పెన నేపధ్యంలో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లతో కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి.