కరోనా ఎఫెక్ట్ : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం- ఇక బాధితులను కనిపెట్టేందుకు ఇంటింటి సర్వే..
ఏపీలో కరోనా వ్యాప్తి నిరోధానికి పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటి సర్వేకూ సిద్దమైంది. విదేశాల నుంచి ఏపీకి వివిధ మార్గాల్లో వచ్చిన కొందరు క్వారంటైన్ కు దూరంగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని బయటికి రప్పించేందు వీలుగా ఇంటింటి సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఏపీలో ఈ సర్వే నిర్వహించి బాధితులను గుర్తించనున్నారు. ఆ తర్వాత వారిని క్వారంటైన్ కు పంపుతారు.
Recommended Video

భారీగా కరోనా అనుమానితులు..
ఏపీలో ఇప్పటివరకూ కరోనా వైరస్ భయాలతో దాదాపు 300 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 8 పాజిటివ్ కేసులుగా తేలాయి.. దాదాపు 200కు పైగా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. మరో 14 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో దాదాపుగా అందరూ విదేశీ ప్రయాణికులే కావడంతో వీరు ఎక్కడెక్కడ తిరిగారు, వీరి వల్ల ఎవరెవరికి కరోనా వైరస్ సోకిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే చాలా మంది పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పాటు ఇళ్లలోనే ఉంటున్నట్లు తేలింది. దీంతో వీరి వివరాలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తే తప్ప రాష్ట్రంలో పరిస్ధితిపై ఓ అంచనాకు రాలేమని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవాళ్టి నుంచి సమగ్ర సర్వే..
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను దాదాపుగా క్వారంటైన్ కు పంపిన ప్రభుత్వం.. వీరికి ప్రాధమిక పరీక్షల తర్వాత దాదాపు చాలా మందికి కరోనా లేదని తేల్చింది. మరికొందరు ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నారు. అయితే వీరిలో దాదాపుగా అందరూ ఎయిర్ ట్రావెలర్సే. కానీ పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు విమానాల్లో చేరుకుని అక్కడి నుంచి ఏపీకి రోడ్డు మార్గంలో చేరుకున్న కొందరికి కరోనా లక్షణాలు ఉన్నాయి. అయితే వీరంతా క్వారంటైన్ కు రాలేదు. దీంతో వీరిని కచ్చితంగా గుర్తించాల్సిన పరిస్దితి ఉంది. వీరితో పాటు మరెవరికైనా కరోనా లక్షణాలు వ్యాపించాయా లేదా అన్నదీ తేలాల్సి ఉంది. దీంతో ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

వాలంటీర్లు, ఆశావర్కర్లతో సర్వే..
రాష్ట్రంలో దాదాపు 3 లక్షల గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరితో పాటు ప్రతీ గ్రామంలో ఆశావర్కర్లు ఉన్నారు. వీరి సాయంతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడుతుంటే వారి వివరాలు తీసుకుని అధికారుల సాయంతో వారిని ఆస్పత్రులకు తరలిస్తారు. అక్కడ క్వారంటైన్ తర్వాత కరోనా లేదని నిర్ధారణ అయితే తిరిగి ఇళ్లకు పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా రేపటి కల్లా పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో ఆఘమేఘాల మీద కరోనా బాధితులను గుర్తించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్లు పరుగులు తీసే పరిస్ధితి.

అవగాహన కల్పించేందుకూ..
ఏపీలో ప్రస్తుతం చేపడుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లే గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు కరోనా బాధితులతో పాటు ఇంట్లోని అందరి వివరాలు తీసుకుంటారు. వీటి ఆధారంగా ఓ డేటా బేస్ కూడా తయారు చేస్తారు. ఇళ్లకు వెళ్లే వాలంటీర్లు కరోనా లక్షణాలున్న వారి వివరాలు తీసుకోవడమే కాక వ్యాప్తి నిరోధంపై ప్రజల్లో అవగాహన కూడా కల్పించనున్నారు. దీంతో ఈ సర్వే రెండు రకాలుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications