ఏపీలో కరోనా బాధితుల సంఖ్య తేలినట్లేనా ? మూడు సర్వేలు పూర్తవుతున్నా..
ఏపీలో కరోనా రోగుల సంఖ్య ఎంతంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి నెలకొంది. జిల్లాల నుంచి రోజువారీ వెలువడుతున్న నివేదికలకూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్లకూ పొంతన ఉండటం లేదనే విమర్శలు ఓవైపు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం హడావిడిగా రెడ్ జోన్లు ప్రకటించడం వెనుక కారణాలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది..

ఏపీలో కరోనా సర్వేలు..
ఏపీలో కరోనా బాధితులు, రోగుల గుర్తింపు కోసం ఇప్పటికే మూడు విడతలుగా సర్వేలు నిర్వహించింది. ఆశావర్కర్లు, వాలంటీర్ల సాయంతో నిర్వహించిన ఈ సర్వేలో పదుల సంఖ్యలో కొత్త రోగులు బయటపడుతూనే ఉన్నారు. అయితే వీరి సంఖ్యను రాష్ట్ర స్ధాయిలో సమగ్రంగా బయటపెట్టలేని పరిస్దితి ఉన్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న రోజువారీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కోటీ 40 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి సర్వే చేశామని చెబుతున్నా.. పూర్తిగా రోగుల సంఖ్య బయటపడకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా గుర్తించని బాధితులు
ఏపీలో మూడు విడతలుగా కుటుంబ సర్వే పూర్తి చేసినా బాదితుల సంఖ్య మాత్రం ఇంకా పూర్తిగా గుర్తించలేకపోయినట్లు క్షేత్రస్ధాయిలో పరిస్దితిని బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికే పలుచోట్ల సర్వే పూర్తయినా ఇంకా అనుమానితుల సంఖ్య బయటపడుతూనే ఉండటం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఇంకా బయటపడని వారు ఎవరైనా ఉన్నారనే అనుమానాలతో ప్రజల్లో భయం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం మూడు సర్వేల్లో ఏం తేల్చిందనే ప్రశ్న తలెత్తుతోంది.

లాక్ డౌన్ గడువు దగ్గరవుతున్నా...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగియబోతోంది. ఏపీలోనూ ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఉంది. దీంతో 14 తర్వాత ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే రెడ్ జోన్లను ప్రకటించినందున వాటికే లాక్ డౌన్ పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇది ఎంతవరకూ సాధ్యం అనే విషయంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అక్కడ లాక్ డౌన్ ఎత్తివేస్తే...
ప్రస్తుతం రాష్ట్రంలో గుర్తించిన 133 రెడ్ జోన్లను మినహాయించి మిగతా చోట్ల లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వైరస్ బాధితుల గుర్తింపు మరింత కష్టంగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో తమ ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగించాలని రాజకీయ నేతలు, స్దానిక ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల నుంచి కూడా ఇదే విధమైన వాదన వినిపిస్తుండటంతో ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications