ఆ వైద్యుడి కుటుంబంలో మరో ఆరుగురికి.., విశాఖ కేసులను దాస్తున్నారని టీడీపీ ఆరోపణలు..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా నేడు 38 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 572కి చేరుకుంది. అత్యధిక కేసుల్లోనూ,కొత్త కేసుల్ నమోదులోనూ కర్నూలు టాప్లో ఉంది. ఇప్పటివరకూ ఆ జిల్లాలో 126 కేసులు నమోదు కాగా.. కొత్తగా నమోదైన 38 కేసుల్లో 13 కేసులు అక్కడ నమోదైనవే. ఇందులో ఆరు కేసులు ఇటీవల మృతి చెందిన ఓ ప్రైవేట్ డాక్టర్ కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో ప్రైవేట్ వైద్యురాలికి కూడా పాజిటివ్గా తేలింది.
ఆ వైద్యుడి కుటుంబంలో మరో ఆరుగురికి
కోవిడ్-19తో చనిపోయిన ఆ డాక్టర్.. కర్నూలు పట్టణంలోని ఉస్మానియా కాలేజీ రోడ్డులో గల ‘కేఎం' ఆస్పత్రి'లో పనిచేసేవారని అధికారులు గుర్తించారు. లక్షణాలేవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్గా తేలిందని తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పైగా ఆయన వయసు కూడా 76 ఏళ్లు కావడంతో వైరస్ను ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల్లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలడం కలవరపెడుతోంది.
కాంటాక్ట్స్ గుర్తించే పనిలో..
ప్రైవేట్ వైద్యురాలి మృతితో ఆమె వద్ద చికిత్స తీసుకున్న పేషెంట్ల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన వద్ద ఎవరైనా చికిత్స తీసుకుని ఉంటే స్వచ్చందంగా ముందుకొచ్చి కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక అంతకుముందు మృతి చెందిన మరో వైద్యుడు కోవిడ్ 19 పేషెంట్లకు చికిత్స చేయలేదని అధికారులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారెంటైన్లో ఉంచారు. డాక్టర్ సెకండరీ కాంటాక్ట్స్ను కూడా అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.
విశాఖ కేసులను దాస్తున్నారని ఆరోపణలు
ఏపీలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయా జిల్లాలకు కేటాయించిన వైద్యులపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీలో మొత్తం 4,779 మంది డాక్టర్లు, 16,481 మంది వైద్య సిబ్బంది ఉండగా..అందులో 58 శాతం మంది విశాఖకే కేటాయించారని ఆరోపిస్తోంది. కేవలం 20 కేసులు మాత్రమే నమోదైన విశాఖకు అంతమంది వైద్య సిబ్బంది ఎందుకు అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు,విశాఖలో కరోనా కేసుల వివరాలను ప్రభుత్వం దాస్తోందని టీడీపీ ఆరోపిస్తుండటం గమనార్హం.
Recommended Video
ఇప్పటివరకు 572.. గుంటూరు,కర్నూలు టాప్..
రాష్ట్రంలో ఇప్పటివరకూ 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 35 మంది డిశ్చార్జ్ కాగా.. 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం 523 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో గుంటూరు,కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే 44శాతం కేసులున్నాయి. నెల్లూరు 64,కృష్ణా 52,ప్రకాశం 42,కడప 37,పశ్చిమ గోదావరి 34 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జాతీయ ఛానల్ విశ్లేషించడం గమనార్హం.