పొరపాట్లు పునరావృతం కానీవద్దు : ముందస్తు చర్యలు తీసుకోండి : సీయస్..సీఈవో ఆదేశం..!
ఎన్నికల కౌంటింగ్లో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ అధికారులను అదేశించారు. జిల్లా కలెక్టర్లు..ఎస్పీలతో వీరిద్దరూ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు.

పోలింగ్ నాటి తప్పులు పునరావృతం కావద్దు..
పోలింగ్ నాడు చోటు చేసుకున్న పొరపాట్లకు అవకాశం లేకుండా కౌంటింగ్ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ అదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

అపోహలు నివృత్తి చేయండి..
కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా స్ట్రాంగ్ రూంల గురించి అనేక అపోహలు వస్తున్నాయని..వీటిని నివృత్తి చేయాలని సీఈవో ఆదేశించారు. ఎక్కడైనా తప్పుడు ప్రచారం జరిగితే చేసే వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని డిజిపి ఠాకూర్ వివరించారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు..
రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని డిజిపి వివరించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీయస్..సీఈవో ఆదేశాలు జారీ చేసారు.












Click it and Unblock the Notifications