జగన్కు షాక్: బెంగళూర్ వెళ్లేందుకు నో పర్మిషన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూర్ వెళ్లడానికి సిపిఐ కోర్టు జగన్కు అనుమతి నిరాకరించింది. జగన్ తరుచూ బెంగళూర్ వెళ్తే విచారణ ముందుకు సాగదని, అందువల్ల జగన్కు బెంగళూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని సిబిఐ కోర్టు ముందు వాదించింది.
సిబిఐ వాదనతో కోర్టు అంగీకరిస్తూ జగన్కు అనుమతి నిరాకరించింది. జగన్కు గతంలో కోర్టు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పార్లమెంటు సభ్యుడు కావడంతో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లేందుకు, రాజకీయ పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించేందుకు కోర్టు జగన్కు అనుమతి ఇచ్చింది.
తనకు బెంగళూర్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని, అక్కడి నుంచి తాను అనంతపురం వెళ్తానని జగన్ కోర్టుతో చెప్పుకున్నారు. అయితే, జగన్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అవసరమైతే బెంగళూర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పడంతో జగన్ ఆ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో తొలి ముద్దాయిగా జగన్పై సిబిఐ కోర్టు చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి కొంత కాలం జైలులో కూడా ఉన్నారు.