ఏపీలో కరోనా: కొత్తగా 18,285 కేసులు, 99మరణాలు -2లక్షల దిగువకు యాక్టివ్ కేసులు -తూర్పులో భయానకం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి స్థిరంగా కొనసాగుతున్నది. గడిచిన వారం రోజులుగా రోజువారీ కేసులు 20వేలకు దిగువన కొనసాగుతున్నా మరణాలు భారీగా ఉంటున్నాయి. స్వల్ప ఊరటనిస్తూ ఇవాళ మరణాలు వంద మార్కు కంటే కిందికి నమోదయ్యాయి. కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై మరింత పట్టుబిగించే దిశగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలివి..
కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 18,285 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,27,390కు చేరింది. కొత్త కేసులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో భయానక పరిస్థితులున్నాయి. అక్కడ అత్యధికంగా 3296 కేసులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో 1876, చిత్తూరు 1822, పశ్చిమ గోదావరి 1664, గుంటూరు 1211, శ్రీకాకుళంలో 1207, నెల్లూరు 1159 కేసులు వచ్చాయి.
కరోనా మహమ్మారికి నిన్న ఒక్కరోజే 99 మంది బలయ్యారు. దీంతో ఇప్పటిదాకా కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,126కి పెరిగింది. నిన్నటి మరణాల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరిలో 13 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
భారత్లో గుర్తించిన B.1.617 రకం ఇప్పుడు 60 దేశాలకు వ్యాపించింది: WHO, ఇండియన్ వేరియంట్ అనొద్దు
కొత్త కేసులు భారీగా ఉంటున్నప్పటికీ, రికవరీలు అంతకు మించి అవుతుండటం ఊరటకలిగిస్తున్నది. 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859కి చేరింది. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు మళ్లీ 2లక్షల మార్కుకు కిందికి వచ్చాయి. ప్రస్తుం ఏపీలో యాక్టివ్ కేసులు 1,92,104గా ఉన్నాయి. ఇదిలా ఉంటే..
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు. కొవిడ్ పరిస్థితులపై జిల్లాల అధికారులతో బుధవారం ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తరచూ తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా.. రెండోసారి చేస్తే కేసులు పెట్టాలని జగన్ స్పష్టం చేశారు.