ఏపీలో కరోనా: మళ్లీ భయానకం -కొత్తగా 2,567 కేసులు, 18 మరణాలు -పరిస్థితిపై జగన్తో ప్రధాని మోదీ ఆరా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ భయాలు రేకెత్తిస్తున్నది. కిందటిరోజు భారీగా తగ్గిన కొత్తకేసులు కాస్తా మళ్లీ పెరిగాయి. మరణాలు స్వల్పంగా తగ్గడం, రికవరీలు భారీగా ఉండటం ఊరట కలిగించే అంశం. ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 81,763 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2,567 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,24,093కు పెరిగింది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 356, ప్రకాశం 351, చిత్తూరు 300, పశ్చిమ గోదావరి 279, గుంటూరు 269, నెల్లూరు 244 కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కొవిడ్ కారణంగా 18 మంది చనిపోయారు. కిందటి రోజుతో(22) పోల్చుకుంటే మరణాల స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 13,042కు పెరిగాయి. కొత్తగా గుంటూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావని, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ బారి నుంచి కొత్తగా 3,034 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,87,236కు పెరిగాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,710గా ఉంది. ఇప్పటిదాకా చేసిన టెస్టుల సంఖ్య 2,31,30,708గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా,
దేశంలో కొవిడ్ రెండో వేవ్ ఉధృతి తగ్గినా, మూడో వేవ్ తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. సోమవారం నాడు ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. ఈనెల 16న ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర సీఎంలతో కరోనా పరిస్థితిపై మాట్లాడనున్నారు. ఈ మేరకు సిద్ధంగా ఉండాలంటూ పీఎంవో నుంచి ఏపీ సీఎంవోకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications