ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన వ్యాప్తి -కొత్తగా 3,797 కేసులు, 35 మరణాలు -వ్యాక్సిన్లపై జగన్ లేఖకు మోదీ రియాక్షన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ విలయం ఇంకా కొనసాగుతోంది. కిందటి రోజుతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కొద్దిగా తగ్గినా, కొత్త కేసులు పెరిగాయి. రికవరీలు సైతం భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు 40వేలకు దిగువన చేరాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖతో దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో మొత్తం 97,696 శాంపిళ్లను పరీక్షించగా, 3797మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,86,618కు పెరిగింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 874 కేసులు, పశ్చిమ గోదావరిలో 493, చిత్తూరు 488 కేసులు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ వందకుపైగానే కొత్త కేసులు వచ్చాయి.
జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్
నిన్న ఒక్కరోజే కరోనాతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 12,706కు పెరిగింది. ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి నలుగులు, శ్రీకాకుళం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ వ్యాధి నుంచి 5498 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,35,574కు పెరిగింది. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు 40వేల మార్కుకు కిందికి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 38,338 యాక్టివ్ కేసులున్నాయి. ఈనెల 28నాటికే ఏపీలో 1.5 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందాయి. కాగా,
వ్యాక్సిన్లకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోదీకి రాసిన లేఖపై కేంద్రం కీలక నిర్ణాయాలు తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన 25శాతం డోసుల్లో చాలా వరకు నిరుపయోగంగా ఉంటున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తే టీకాల వృథాను అరికొట్టొచ్చన్న జగన్ సూచనను కేంద్రం ఆచరణలో పెట్టింది. ప్రైవేటు ఆస్పత్రులు ఇకపై వ్యాక్సిన్లను నేరుగా కంపెనీల నుంచి కొనరాదని, ప్రభుత్వం రూపొందించిన కొవిన్ పోర్టల్ ద్వారానే ఆర్డర్లు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అలాగే, ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించే టీకా డోసుల సంఖ్యపైనా కేంద్రం నియంత్రణ విధించింది. అవసరాలకు తగినంత మాత్రమే ఇకపై సరఫరా చేస్తారు.