ఏపీలో 40 మంది సూపర్ స్ప్రెడర్ల ద్వారా 300 మందికి కరోనా...తాజా నివేదికలో షాకింగ్ నిజాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా జరిగింది, ఇప్పటివరకూ దాదాపు 2 వేల మందికి పైగా బాధితులు కావడానికి వెనుక గల కారణాలేంటి అన్న అంశాలపై ప్రభుత్వం జరిపిన సమగ్ర పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇందులో కేవలం 40 మంది ద్వారా ఏకంగా 300 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరిని సూపర్ స్ప్రెడర్లుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
Recommended Video
కరోనా, విశాఖ గ్యాస్ లీకేజీపై జగన్ సమీక్ష: కీలక ఆదేశాలు
40 మంది నుంచి 300 మందికి వ్యాప్తి..
ఏపీలో వివిధ కారణాలతో ఆరంభ దశలో కరోనా రోగులుగా నిర్ధారణ అయిన 40 మంది నుంచి ఏకంగా 300 మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు తాజాగా ప్రభుత్వం జరిపిన పరిశోధనలో తేలింది. ఈ 40 మంది విదేశాల నుంచి వచ్చినవారితో పాటు ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా ఆరంభ దశలో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి పోవడం వల్ల వైరస్ వ్యాపించింది. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు లాక్ డౌన్ లోనూ ఇతరుల ఇళ్లకు వెళ్లి మరీ కరోనా వ్యాపింపజేసిన సందర్భాలూ ఉన్నాయి.
ప్రధాన సూపర్ స్పెడర్లు వీరే...
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్ సోకింది. కృష్ణాజిల్లాలో ఒకరి నుంచి 18 మందికి సోకింది. అలాగే గుంటూరు జిల్లాల్లోనూ ఒకరి నుంచి 17 మందికి వైరస్ వ్యాపించింది. ఇదే జిల్లాలో పలువురు వ్యక్తులు కనీసం ఐదుగురి నుంచి 15 మందికి కరోనా మహమ్మారిని అంటించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాలైన అనంతపురం, తూర్పుగోదావరిలో ఒక్కొక్కరి నుంచి 12 మంది వరకూ వైరస్ పాకింది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 10 మందికి వైరస్ వ్యాపించింది.
80 శాతం మందికి లక్షణాలే లేవు...
ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల నుంచి వైరస్ వ్యాపించిందని భావించిన వారిలో లేదని తేలడం ఇక్కడ మరో విశేషం. ఉదాహరణకు ఢిల్లీ మర్కజ్ నుంచి భారీ సంఖ్యలో జనం తిరిగొచ్చిన జిల్లాల్లో కేసుల సంఖ్య ఇప్పటికీ రెండంకెలు దాటలేదు. అంటే రోగుల నుంచి వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ సోకలేదని తేలింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే రోగుల నుంచి 80 శాతం మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ సోకలేదని తేలడం మరో విశేషం.