Viral Video : బీజేపీ ఎంపీ జీవీఎల్ ను తన్నిన గోవు-వీడియో వైరల్ !
నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ వీలు దొరికినప్పుడల్లా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ కనిపించే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఇవాళ ఓ చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జీవీఎల్ కు అనూహ్యంగా గోవు షాకిచ్చింది.
గుంటూరులో మర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభించేందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వచ్చారు. కొత్త భవనం కావడంతో సంప్రదాయంగా అసోసియేషన్ ప్రతినిధులు గోవును తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జీవీఎల్ వచ్చీ రాగానే గోవు దగ్గరికి వెళ్లి లాలించేందుకు ప్రయత్నించారు. అంతే ఆయన్ను గోవు కాలితో తన్నింది. దీంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఆవు అకస్మాత్తుగా తన్నడంతో కాసేపు దూరం జరిగారు.
మళ్లీ గోవు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గోవు మళ్లీ తన్నేందుకు ప్రయత్నించింది. ఈసారి నిర్వాహకులు ఆవును పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి నుంచి జీవీఎల్ నరసింహారావు బయలుదేరి కార్యక్రమం ప్రారంభోత్సవానికి లోపలికి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న అసోసియేషన్ ప్రతినిధులు గోవు ఇలా జీవీఎల్ ను చూసి ఎందుకు ఉలిక్కిపడి తంతోందన్న దానిపై చర్చించుకోవడం కనిపించింది.
బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు మాటకారిగా పేరుంది. గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ విధానాల్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన వాక్చాతుర్యం కనిపిస్తుంటుంది. రాష్ట్రం తరఫున పలు సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించడంలోనూ జీవీఎల్ ముందుంటారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల కంటే కూడా జీవీఎల్ ఎక్కువగా పార్లమెంటులో హల్ చల్ చేస్తుంటారు. దీంతో గుంటూరులో మిర్చి ఎగుమతిదారుల అసోసియేషన్ భవన ప్రారంభానికి ఆయన్ను ఆహ్వనించారు. తీరా చూస్తే ఆయనకు షాక్ తప్పలేదు.