గవర్నర్ ఒక బఫూన్ లా మారాడు...సిపిఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
విజయవాడ: తన వ్యాఖ్యలతో, చర్యలతో సంచలనం సృష్టించే సిపిఐ నేత నారాయణ ఈసారి గవర్నర్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పై కూడా నారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
సీపీఐ నేత నారాయణ గవర్నర్ నరసింహన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గవర్నర్ ఒక బఫూన్లా మారారని నారాయణ ఎద్దేవాచేశారు. నరసింహన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తి...గవర్నర్ వ్యవస్థకే కళంకం తీసుకువచ్చారని నారాయణ విమర్శించారు.
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అత్యుత్సాహంతో ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారని, ఈ చర్య ద్వారా ఈసీని, ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆయన ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్న బీజేపీ...న్యాయ సంక్షోభంపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు పరిష్కారం కాకుండా...రాజీ చేసుకుంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని నారాయణ వ్యాఖ్యానించారు.