పాపాలు చేసి కేంద్రంపైకి నెట్టేస్తావా, మీ పని మీరు చేసుకోండి: బాబుకు ముఖం మీదే చెప్పిన సీపీఎం మధు
అమరావతి: ప్రత్యేక హోదాపై అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సీపీఎం నేత మధు స్వయంగా చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాటం కోసం చంద్రబాబు అఖిల పక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే.
వాడిగావేడిగా అఖిలపక్షం: నిలదీసిన మధు, అందుకేనని బాబు సమాధానం
ఈ భేటీకి టీడీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు వచ్చారు. భేటీలో పాల్గొన్న అనంతరం సీపీఎం మధు మీడియాతో మాట్లాడారు. గతంలో తాము హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టారని, ఇప్పుడు మీ పని మీరు చేసుకోండి, మా పని మేం చేసుకుంటామని చంద్రబాబు ముఖం మీదే చెప్పేశామన్నారు. అఖిల పక్షంతో అందరినీ కలుపుకు వెళ్దామని చంద్రబాబు అనుకుంటే సీపీఎం ఆయనను ఏకాకిని చేసింది. కాంగ్రెస్ కలిసే పరిస్థితి దాదాపు ఉండదు.
హోదాలో టీడీపీ-బీజేపీలది తప్పు, కేంద్రంపై నిందలు సరికాదు
ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో బీజేపీది ఎంత తప్పు ఉందో, టీడీపీది అంతే ఉందని, రెండు పార్టీలదీ సమాన పాత్ర అని మధు అన్నారు. ఒక్క కేంద్రం పైనే నిందలు వేయడం సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని బీజేపీ అమలు చేయడం లేదన్నారు. టీడీపీ నాలుగేళ్లుగా ఆ పార్టీని వెనుకేసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.
తీర్మానానికి నో, మీ పని మీరు చూసుకోండని చెప్పాం
ప్రత్యేక హోదాపై తీర్మానం చేద్దామని చంద్రబాబు చెప్పారని, కలిసి పోరాటం చేద్దామని చెప్పారని, కానీ ఇన్నాళ్లు హోదా వద్దని, ప్యాకేజీ కావాలని చెప్పి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, అందుకే తీర్మానం వద్దని చెప్పామని మధు అన్నారు. మీతో కలిసి పోరాటం చేయలేమని చెప్పామన్నారు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేం చూసుకుంటామని చంద్రబాబు ఎదుటే చెప్పామన్నారు.
చేసిన పాపాలన్నీ చేసి
హోదా విషయంలో బీజేపీ నేరం ఎంత ఉందో, టీడీపీది అంతే అని మధు అన్నారు. అందుకే తీర్మానం వద్దని చెప్పామన్నారు. రైల్వే జోన్ విషయమై ఇంకా మాట్లాడటం విడ్డూరమన్నారు. చేసిన పాపాలన్నీ చేసి నాలుగేళ్ల తర్వాత ఇలాగా అన్నారు. తల్లిదండ్రులను చంపిన ఓ వ్యక్తికి శిక్ష పడితే, అతను కోర్టులో తనకు తల్లిదండ్రులు లేరని, శిక్ష వేయవద్దని కోరినట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు.
అమిత్ షా లేఖపై మధు
రాయలసీమకు, ఉత్తరాంధ్రకు రూ.1050 కేంద్రం ఇచ్చిందని, వాటికి యూసీలు పంపలేదని అమిత్ షా లేఖ రాయడం సరికాదని మధు అన్నారు. హోదా విషయంలో తాము చాలాకాలం నుంచి పోరాటం చేస్తున్నామని, మీరు ఇప్పుడు వచ్చారని చంద్రబాబుకు చెప్పానని, అందుకే మీ పోరాటం మీరు, మా పోరాటం మేం చేస్తామని చెప్పానని అన్నారు. హోదాపై జనసేన, లెఫ్ట్, వైసీపీ, హోదా సాధనా సమితి.. ఇలా ఎన్నో పోరాడుతున్నాయని, వాటితో కలిసి పోరాడుతామన్నారు. నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీలు మాత్రమే లేవన్నారు.
అందుకే బయటకు వచ్చేశాం, పోరాడితే కేసులు పెట్టారు
తనకు పని ఉందని భేటీ మధ్యలో వచ్చేశామని మధు చెప్పారు. తాము బైకాట్ చేసేందుకు సమావేశానికి రాలేదన్నారు. తాము లోపల ఉన్నంత సేపు పోరాటం చేద్దామని చెప్పలేదన్నారు. తీర్మానానికి నో చెప్పామన్నారు. గతంలో మేం పోరాడితే కేసులు పెట్టారని, రాజకీయంగా తూలనాడారని, అన్నింటికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మధు అన్నారు.
హోదాపై తీర్మానం అన్నప్పుడు మాత్రం మేం కలవమని చెప్పామని మధు తెలిపారు. కావాలంటే తీర్మానం ఎవరి పార్టీ వారు చేసుకుంటారని తెలిపారు.