త్వరలో ఎపి బంద్...రాష్ట్రంలో త్రిముఖ పోరు:సిపిఎం మధు
తిరుపతి:కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం త్వరలో ఏపీ బంద్ చేపడతామని సిపిఎం నేత మధు చెప్పారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు చేస్తున్న దీక్షను స్వాగతిస్తున్నామని సీపీఎం మధు అన్నారు.
శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధనకై త్వరలో ఏపీ బంద్ చేపడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ వాతావరణం ఉందన్నారు. ఈ పోరులో జనసేన పార్టీదే విజయమన్నారు. జనసేన, వైసీపీ, టీడీపీ వరుస స్థానాల్లో ఉంటాయని సీపీఎం మధు పేర్కొన్నారు.

ఇంతకాలం టిడిపి, బిజెపి కలిసి కుమ్మక్కు కావడం వల్లే ఎపి విభజన హామీలు నెరవేరలేదని సిపిఎం మధు చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెంటనే కడపకు ఉక్కు పరిశ్రమ కేటాయించాలని, లేని పక్షంలో కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు....అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ కోసం మేము నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే...టిడిపి నేతలు ఇప్పుడు మేల్కొన్నారని ఆయన విమర్శించారు.
మామిడి, పాల రైతులను సిఎం చంద్రబాబు వెంటనే ఆదుకోవాలని...లేని పక్షంలో ఉద్యమబాటను అందుకుంటామని చెప్పారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర సమస్యలను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications