ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే..?: సీపీఎస్ సర్వే రిపోర్ట్స్: అమరావతి పరిధిలో వైసీపీపై
అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందనే అంశంపై సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంటుంది. అధికారాన్ని అందుకున్న పార్టీకి ఏడాది గడువును కూడా ఇస్తుంటారు రాజకీయ ప్రత్యర్థులు. పరిపాలనపై అవగాహన తెచ్చుకోవడానికి అధికార పార్టీకి ఆ మాత్రం గడువు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న వ్యవహారమే. ఈ ఏడాది కాలంలో అధికార పార్టీ ఏవైనా పొరపాట్లు చేసినా.. తొలి ఏడాది కాబట్టి సరిబెట్టుకుంటున్నామనే వ్యాఖ్యలు తరచూ ప్రతిపక్ష పార్టీల నుంచీ వినిపిస్తుంటాయి.

ప్రభుత్వ పాలన, రాజకీయ స్థితిగతులపై..
ఈ ఏడాది కాలంలో ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్ష పార్టీల స్థానం ఎలా ఉంది? పాలనా తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్లుగా ఈ ఏడాది కాలంలోనే వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధనపై ప్రజల అభిప్రాయాలేంటీ? మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి పరిధిలో ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలుే నిర్వహిస్తే అధికారం ఎవరిని వరిస్తుందనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది సీపీఎస్.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే..
హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) నిర్వహించిన సర్వే ఇది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని అందుకుంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు కంటే కూడా వైసీపీ ఓటు బ్యాంకు మెరుగుపడిందని పేర్కొంది. గత ఏడాది ముగిసిన ఎన్నికల సందర్భంగా వైసీపీ 51 శాతం ఓట్లను సాధించుకోగా.. ఈ సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే అధికార వైసీపీ 55.8 శాతం ఓట్లను కొల్లగొడుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అనేవి ఏ మాత్రం లేవని తమ సర్వే ద్వారా తేలినట్టయిందని పేర్కొంది.

టీడీపీ పరిస్థితేంటీ?
ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లశాతం మరింత తగ్గుతుందని సీపీఎస్ సర్వే అంచనా వేసింది. టీడీపీ 38.3 శాతం ఓట్లు పోల్ అవుతాయని తమ సర్వేలో తేలినట్లు తెలియజేసింది. భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసినా 5.3 శాతానికి ఓట్ల శాతం పెరగపోవచ్చని పేర్కొంది. ఇదివరకు కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు తగ్గకపోవడానికి ప్రధాన కారణం.. ప్రజలు ఎక్కువ మంది వైసీపీ వైపు మొగ్గు చూపడమేనని తాము అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.

రాజధాని ప్రాంతంలోనూ వైసీపీకి ఆదరణ..
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంతంలో ఏ స్థాయిలో రైతులు నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారో తెలిసిన విషయమే. అమరావతి రైతు పరిరక్షణ సమితి పేరుతో రైతులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికీ ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతులు ఇళ్లల్లోనే ఉంటూ నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. అలాంటి చోట కూడా వైఎస్ఆర్సీపీకి ఆదరణ తగ్గలేదని సీపీఎస్ సర్వే వెల్లడించింది.

జగన్ పాలనపై అమరావతి ప్రాంతంలో..
వైఎస్ జగన్ పరిపాలనపై అమరావతి ప్రాంత ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అంచనాలకు అనుగుణంగా పాలిస్తున్నారని 54.9 శాతం మంది అమరావతి ప్రాంత ప్రజలు వెల్లడించారు. 42.1 శాతం మంది బాగోలేదని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. 74 శాతం మంది ప్రజలు జగన్ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఈ సంఖ్య రాయలసీమలో తక్కువగా నమోదైంది. అక్కడ 67.1 శాతం సంతృప్తి వ్యక్తమైందని సీపీఎస్ సర్వే వెల్లడించింది.
Recommended Video

కరోనా నియంత్రణ, ఇంగ్లీష్ మీడియంపైనా
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని ప్రజలు అభిప్రాయపడినట్లు సీపీఎస్ సర్వే వెల్లడించింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఇదే ప్రధానకారణమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడానికి కూడా 96 శాతం మంది ప్రజలు జై కొట్టినట్టు సీపీఎస్ సర్వే స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications