ఏపీ తీరు వల్ల ఇండియాకు రావట్లేదు!: జపాన్ సంస్థకు సీఆర్డీఏ షాక్
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ జపాన్ కంపెనీ మకీ అసోసియేట్స్కు సీఆర్డీఏ లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ జపాన్ కంపెనీ మకీ అసోసియేట్స్కు సీఆర్డీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ మకీ చైర్మన్ పుమిహికో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
బీహార్ కంటే ఏపీలో చెత్త పాలన ఉందన్నారు. ప్రతి విషయంలో రాజకీయ జోక్యం ఉంటుందని, సీఆర్డీఏను స్వతంత్రంగా పని చేయనివ్వరని ఆయన వ్యాఖ్యానించారు.
వేర్వేరుగా నోటీసులు
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మకీ అసోసియేట్స్తో పాటు ఆ సంస్థ చైర్మన్ పుమిహికో మకీకి వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏ ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగించేలా వివిధ వెబ్ సైట్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ సీఆర్డీఏ ఈ నోటీసులు జారీ చేసింది.
సంచలన ఆరోపణ
రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశమాత్రం కూడా లేదని అప్పట్లో డిజైన్ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్ సంస్థ మకీ అండ్ అసోసియేట్స్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పెద్దల స్వార్థం కోసమంటూ..
ఇండియన్ ఆర్కిటెక్చరల్ ప్రొఫెషన్ ప్రతిష్టకు ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కాల్సిన కాంట్రాక్టును రద్దు చేశారని మండిపడింది.
ఆర్కిటెక్కులు సాహసం చేయలేరని..
ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుతో భారత దేశంలో పని చేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరని మకీ అండ్ అసోసియేట్స్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్టర్ పుమిహికో మకీ 2016 డిసెంబర్ 21న భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య అధ్యక్షులు విజయ్ గర్గ్కు లేఖ రాశారు.