Y S Jagan బెయిల్పై సీబీఐ కప్పదాటు- కౌంటర్పై విమర్శలు- బాధ్యతారాహిత్యమన్న టీడీపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సీబీఐతో పాటు సీఎం జగన్ కూడా నిన్న కౌంటర్లు దాఖలు చేశారు. అయితే జగన్ కౌంటర్ విషయం ఎలా ఉన్నా సీబీఐ దాఖలు చేసిన మెమోపై విమర్శలు వస్తున్నాయి. జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వచ్చినప్పుడు దానిపై స్ఫష్టమైన వైఖరి వెల్లడించకుండా సీబీఐ కప్పదాటు వైఖరి ఎంచుకోవడం విమర్శలకు తావిస్తోంది. సీబీఐది బాధ్యతారాహిత్యమని టీడీపీ విమర్శిస్తోంది.
జగన్ బెయిల్పై సీబీఐ ఏం చెప్పింది ?
రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ సీబీఐ దాఖలు చేసిన మెమోలో గౌరవనీయ సీబీఐ కోర్టు చట్ట ప్రకారం జగన్బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. తద్వారా జగన్ బెయిల్ రద్దును సమర్ధించడం లేదు, వ్యతిరేకించడం లేదన్న భావన సీబీఐ మెమోలో వ్యక్తమైంది. ఇదే పిటిషన్ తదుపరి విచారణలో కీలకంగా మారింది. సీబీఐ ఓ దర్యాప్తు సంస్ధగా అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై అభిప్రాయం చెప్పాల్సిన తరుణంలో మీ ఇష్టమంటూ సీబీఐ కోర్టుపైకి నెట్టేయడం ఆశ్చర్యకరంగా మారింది.
సీబీఐ కప్పదాటు వైఖరి
జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలుకు రెండుసార్లు సమయం కోరిన సీబీఐ న్యాయవాదులు ఎట్టకేలకు నిన్న మెమో సమర్పించారు. ఇందులో రఘురామరాజు కోరుతున్నట్లుగా జగన్ బెయిల్ రద్దు చేయాలా లేక బెయిల్ కొనసాగించాలా అన్న దానిపై సీబీఐ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. దర్యాప్తు సంస్ధగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ సీబీఐ మాత్రం కప్పదాటు వైఖరినే ఎంచుకుంది. దీంతో సీబీఐ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐది బాధ్యతారాహిత్యమన్న టీడీపీ
రఘురామరాజు పిటిషన్పై కౌంటర్ ఇచ్చే క్రమంలో సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ న్యాయవాదులు మెమో దాఖలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. సీబీఐది బాద్యతారాహిత్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య విమర్శించారు. ఈ కేసులో సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయమని కోరకపోయినా కనీసం క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాలని అదేశాలు ఇవ్వాలని అయినా కోరాల్సిందని, అలా చేయకుండా పూర్తగా కోర్టు ఇష్టమని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని వర్ల రామయ్య విమర్శించారు.